ఎవరి దార్లో వారు వెళ్తారా?: కోదండలో ఆందోళన!

భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం లేదని, హైదరాబాద్-కర్నూలు రహదారిపై సడక్ బంద్ వైఫల్యానికి ఇదే కారణమని శనివారం జరిగిన ఐకాస సమావేశంలో అభిప్రాయపడ్డారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా భాగస్వామ్య పక్షాలు ఇలాగే ఎవరి దారిన వారు వెళితే తెలంగాణ ఉద్యమం పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. భాగస్వామ్య పార్టీలు ఎన్నికల్లో గెలవకపోతే తెలంగాణ వాదం లేదంటారని, ఎన్నికల్లో తెలంగాణ వాదం గెలవడానికి ఉద్యమం ఉపయోగపడాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.
శనివారం కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన లక్ష్యంగా తాము పిలుపునిస్తున్న కార్యక్రమాల అమలులో పూర్తిగా భాగస్వామ్య పార్టీల పైనే ఆధారపడితే భవిష్యత్తులోనూ సడక్ బంద్ వైఫల్యాలు తప్పవని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డట్లుగా సమాచారం. తెరాస, బిజెపి, న్యూ డెమోక్రసీ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడాన్ని గుర్తించారు.
ఐకాస సడక్ బంద్కు పిలుపునిస్తే భాగస్వామ్య పార్టీలు ఉమ్మడిగా పాల్గొనటానికి ముందుకు రాకపోవడాన్ని ఒక లోపంగా గుర్తించారట. రేపు ఎన్నికలలో కూడా ఈ పార్టీలు వేటి దారిలో అవి వెళితే, ఉద్యమం పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఏప్రిల్ 15 లోపు భాగస్వామ్య పార్టీల మండల శాఖల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఇది చలో అసెంబ్లీ విజయవంతానికి దోహదపడుతుందని.. చలో అసెంబ్లీ తర్వాతే మేలో హైదరాబాద్-విజయవాడ సడక్ బంద్ చేపట్టాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications