కాంగ్రెసుపై మారిన కెసిఆర్ వ్యూహం?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తనను దూరం పెట్టినందుకు కాంగ్రెసు అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు దగ్గరయ్యేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతం చేయించడానికి ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఆయన పది జిల్లాల్లో బస్సు యాత్ర చేయాలని ఆయన అనుకున్నారు. ఇప్పుడు ఆయన తన వైఖరి మార్చుకుని ఆహార భద్రత బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన రాజీ ధోరణీని అనుసరిస్తున్నారా, మారిన పరిస్థితులను అనుకూలంగా మల్చుకొనేందుకు వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తున్నారా అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయనున్నట్లు ఢిల్లీలో ప్రచారం సాగుతోంది. ఈ రకమైన ప్రచారాల నేపథ్యంలో కెసిఆర్కు కాంగ్రెస్కు దగ్గరవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న నాలుగైదు రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం చేస్తానని కెసిఆర్ వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణలోని పది జిల్లాలలో బస్సుయాత్ర చేయాలని కూడా కార్యక్రమాన్ని రూపొందించుకొన్నారు. ముందు అనుకున్న ప్రకారం ఆహారభద్రత బిల్లు ఓటింగ్లో కాంగ్రెస్పై ఒత్తిడి పెంచి తెలంగాణ తొందరగా ఏర్పాటు చేయాలని కెసిఆర్ డిమాండ్ చేయాలి. కానీ అలాంటివేమీ లేకుండా ఆహారభద్రతా బిల్లుకు మద్దతు ఇచ్చారు.
అయితే, తెలంగాణ క్రెడిట్ ఇతర పార్టీలకు దక్కకుండా కాంగ్రెసు జాగ్రత్త పడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేయడానికే ఆవిర్భవించిన తెరాసకు కూడా ఆ క్రెడిట్ లభించకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెసులో విలీనానికి కెసిఆర్ సుముఖత వ్యక్తం చేయవచ్చునని, లేదంటే ఎన్నికలకు ముందే పొత్తుకు దిగవచ్చునని అంటున్నారు. కాగా, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం కెసిఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications