బొత్స ఔట్-కిరణ్ డౌట్: చిరు కోసం లాబీయింగ్
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి రేసు నుండి తప్పుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కూడా లక్ష్యమేనని బొత్స ఒకటి రెండుసార్లు చెప్పారు. బొత్స అలా చెప్పాక సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను టార్గెట్ చేసుకొని మద్యంపై దాడులు చేయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది బొత్స ఇమేజ్ను అధిష్టానం వద్ద దెబ్బతీసింది.
అప్పటి వరకు అధిష్టానం దృష్టిలో బొత్సకు ఇమేజ్ కాస్త పోయింది. ఆ తర్వాత కిరణ్ క్రమంగా తన పరపతి పెంచుకుంటూ వచ్చారు. 2014లో మరోసారి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే సిఎం పీఠమెక్కాలని బొత్స, కిరణ్లతో పాటు చిరంజీవి కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశలో ఎవరికి వారు మౌనంగా పావులు కదుపుకుంటూ వెళ్తున్నారు. బొత్స ఇమేజ్ అధిష్టానం వద్ద కాస్త డ్యామేజ్ కావడంతో ఆయన ఈ రేసు నుండి తప్పుకున్నారని అంటున్నారు.
కర్నాటకలో కాంగ్రెసు గెలుపు ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసులో కూడా కనిపిస్తోంది. మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో 2014 నాటి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు.
పర్యాటకం, కర్నాటక ఎఫెక్ట్
కిరణ్ కుమార్ రెడ్డి దూకుడుగా వెళ్తూ రేసులో ఉన్నప్పటికీ ఆయనకు వచ్చేసారి కష్టమే అంటున్నారు. పర్యాటక శాఖను చేపట్టిన చిరంజీవి దూకుడుగా వెళ్తున్నారు. దానికి తోడు ఇటీవల కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేసి అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేశారు. దీంతో చిరంజీవి సిఎం రేసులో అందరికంటే ముందున్నారు. అందుకు తోడు ఆయన వర్గం నేతలు ఇటీవల ఆయనను రేసులో మరింత ముందుకు తోస్తున్నారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు సానుకూలంగా ఉండటంలో చిరంజీవి పాత్ర కూడా ఉందని ఆయన వర్గం చెబుతోంది. అధిష్టానం కూడా చిరుకు వచ్చిన ఆదరణ చూసి ముక్కున వేలేసుకుందట. అందుకే ఆయనను రెండోసారి ప్రచారానికి పంపించింది. ఈ నేపథ్యంలో పలువురు చిరంజీవి వర్గం నేతలు ఢిల్లీకి వెళ్లి త్వరలో చిరంజీవి కోసం లాబీయింగ్ ప్రారంభిస్తారనే ప్రచారం సాగుతోంది. వారికి బొత్స అండదండలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.