ఫొటోలు: చిరంజీవికి అధిష్టానం సంకేతాలు
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ పదవుల్లో కేంద్ర మంత్రి చిరంజీవి వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ద్వారా కాంగ్రెసు అధిష్టానం ఏం చెప్పదలుచుకున్నదనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత తన వర్గానికి తగిన ప్రాధాన్యం కోసం, పదవుల కోసం చిరంజీవి ఒత్తిడి పెడుతూ వచ్చారు. ఈ ఒత్తిడిలో భాగంగానే సి. రామచంద్రయ్యకు, గంటా శ్రీనివాస రావుకు రాష్ట్రం మంత్రివర్గంలో చోటు దక్కింది.
కాంగ్రెసులో చిరంజీవి వర్గం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి మొదటి నుంచీ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రత్యేకత అనే పద్ధతిని దెబ్బ కొట్టాలనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ పదవుల పంపకంలో చిరంజీవి సూచనను పట్టించుకోలేదనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసు అధిష్టానానికి విధేయంగా ఉండేవారికి మాత్రమే టికెట్లు దక్కుతాయనే సంకేతాలను కూడా షబ్బీర్ అలీకి టికెట్ ఇవ్వడం ద్వారా, పొంగులేటి సుధాకర్ రెడ్డిని తిరిగి నామినేట్ చేయడం ద్వారా ఇచ్చినట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి చిరంజీవికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానివల్లనే చిరంజీవి ఎంతగా పట్టుబట్టినా ఆ వర్గానికి చెందిన నాయకులకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వలేదని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీలో కోటగిరి విద్యాధర రావు కీలకమైన పాత్ర పోషించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ఆయనకు తగిన ప్రాధాన్యం ఉండే పదవిని ఇప్పించాలని చిరంజీవి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అది కలిసి రావడం లేదు.
తనకు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాస రావుకు రాష్ట్ర మంత్రివర్గంలో చిరంజీవి చోటు కల్పించగలిగారు. ఆయన ఇప్పటికీ చిరంజీవికి విధేయుడిగానే మసలుతున్నాడు.
ఇక దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిరంజీవిని ఎప్పటికప్పుడు తమ నాయకుడిగా ప్రకటించుకుంటూ వస్తున్నారు. సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇప్పించడంలో కూడా చిరంజీవి విజయం సాధించారు.
పార్టీలో వర్గాలకు తావు లేదని చిరంజీవితో పాటు మిగతా సీనియర్ నాయకులు చెప్పడానికే అన్నట్లు అధిష్టానం పెద్దలకు, ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.
ఇక పొంగులేటి సుధాకర్ రెడ్డి విషయం చెప్పాల్సిన పని లేదు. ఆయనకు అధిష్టానం ఆశీస్సులే కొండంత అండ. ఆయన అధిష్టానం పెద్దల ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఉంటారు. అందుకే ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ టికెట్ దక్కింది.
చిరంజీవి నినాదంసామాజిక న్యాయం పేరుతోనే సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు పేరును పక్కన పెట్టారు. ఈ విషయం తెలియగానే మంత్రి సి.రామచంద్రయ్య, చిరంజీవి వ్యక్తిగత కార్యదర్శి విక్రమ్ హుటాహుటిన వెళ్లి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆయన నివాసంలో కలిశారు. ఎస్సీ వర్గానికి చెందిన జంగా గౌతమ్ పేరును పరిశీలించాలని రామచంద్రయ్యతో చిరంజీవి కబురు పెట్టారు. స్వయంగా తాను కూడా బొత్సకు ఫోన్ చేసి మాట్లాడారు. అయినా, చిరంజీవి వర్గాన్ని పట్టించుకోలేదు.
ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన జాబితాను చూసి కాంగ్రెసు పార్టీలో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంది. అభ్యర్థుల ఎంపిక పార్టీకి ఏ విధమైన ప్రయోజనం ఒనగూరే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెల రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధిష్ఠానం పెద్దల ఇళ్లముందు పడిగాపులు కాసిన పలువురు ఆశావహులు కూడా ఈ జాబితా చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
సీనియర్ నేతలైన జైపాల్రెడ్డి, చిరంజీవి, సర్వే సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్కుమార్, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి లాంటి నేతల సిఫార్సులను కూడా అధిష్ఠానం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, సీనియర్ నేతలైనా, ఎవరైనా - చిరంజీవి సహా తమకు నమ్మకంగా ఉండాలని సంకేతాలు కాంగ్రెసు అధిష్టానం సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు.