ఉద్యోగంతో గాలం: యువనేతలతో లోకేష్ చక్కర్లు!

మహానాడు తర్వాత లోకేష్ అదే దార్లో వెళ్లనున్నట్లుగా కనిపిస్తోంది. యువత ప్రధానంగా రాజకీయాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వారిని చైతన్యవంతులను చేయాలని ఆయన భావిస్తున్నారట. అవినీతి తదితర అంశాలపై యువతకు పూసగుచ్చి చెప్పాలనుకుంటున్నారట. తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు విద్య, ఉద్యోగావలాఖాలు ఎలా ఉండేవి? కాంగ్రెసు పాలనలో ఎలా ఉన్నాయనే అంశాలను ఆయన రాష్ట్రవ్యాప్తంగా యువతకు తెలియజెప్పేందుకు సిద్ధమవుతున్నారట.
ఇందుకోసం ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు, కార్యకర్తల్లోకి వస్తానని, వారిలో ఒకడిగా పని చేస్తానని మినీ మహానాడు సందర్భంగా లోకేష్ ప్రకటించారు. ఇక నుండి అతను పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లి యువ సభలను నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు యువతను టిడిపి వైపుకు మళ్లించాలని చూస్తున్నారట.
వచ్చే రెండు నెలల్లో యువ సభలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు ఐదు వందల సభలను ఏర్పాటు నిర్వహించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తానొక్కడినే రాష్ట్రమంతా తిరగలేనని భావించిన లోకేష్... మరికొంతమంది యువ నేతలను తయారు చేసుకున్నారట. యువ నేతలకు ఆయా జిల్లాల్లో తిరిగే బాధ్యతను అప్పగించి.. లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications