చంద్రబాబుకు నరేంద్ర మోడీ తలనొప్పి?

బిజెపితో పొత్తుకు తెలుగుదేశం తెలంగాణ నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మోడీ పట్ల నిజానికి చంద్రబాబుకు కూడా సానుకూల వైఖరి ఉందని అంటారు. గుజరాత్ను అభివృద్ధి చేసిన తీరు చంద్రబాబుకు నచ్చిందని చెబుతారు. అయితే, బిజెపితో పొత్తు వల్ల ముస్లింలు దూరమవుతారనే భయం చంద్రబాబుకు ఉంది. పార్టీ లౌకిక లక్షణానికి దెబ్బ తగలకూడదనే ఉద్దేశంతో బిజెపికి దూరంగా ఉండడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ, పార్టీ తెలంగాణ నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఆయనకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణలో తన అవకాశాలను మెరుగుపరుచుకుంటుందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసులో విలీనమవుతుందని పార్టీ తెలంగాణ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెసును ఎదుర్కోవాలంటే బిజెపితో పొత్తు పెట్టుకోవడం అవసరమని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ కారణంగా, తెలంగాణ అనుకూల వైఖరి వల్ల తెలంగాణలో బిజెపి తన బలాన్ని పెంచుకుందని, ఆ బలంతో తమ పార్టీ బలం కలిస్తే కాంగ్రెసును తగిన రీతిలో ఎదుర్కోగలమని, దాని వల్ల పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని వారు అంటున్నట్లు సమాచారం.
తెలంగాణ నేతల వాదనల్లోని సామంజస్యాన్ని చంద్రబాబు గుర్తించినప్పటికీ బిజెపితో పొత్తుకు అంత ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుంటే సిపిఐ, సిపిఎం తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న ముస్లింలు కూడా పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ కారణంగా చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి సముఖంగా లేరని అంటున్నారు.
అయితే, నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది. హైదరాబాదు సభ నుంచి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్టీఆర్ వారసత్వాన్ని స్వీకరించాలని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీకి పిలుపునిచ్చారు. కాంగ్ర్రెస్ వ్యతిరేకత అనే ఎజెండాపై తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి పని చేసే అవకాశం ఉంది. కానీ, అందుకు చంద్రబాబు ఎంత వరకు సిద్ధపడుతారనేది ఇప్పుడే చెప్పలేం.












Click it and Unblock the Notifications