ఫొటోలు: సీమాంధ్రలో సెగలు, చీరలు కట్టారు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకింగా సీమాంధ్రలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తెలంగాణ నుంచి ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
భీమా భవన్లో ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఆంధ్ర ఉద్యోగులు సమైక్య నినాదాలు చేయడంతో తెలంగాణ ఉద్యోగులు ప్రతిగా తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచారు. రాష్ట్ర సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగులు ధర్నాకు దిగారు.
సీమాంధ్రలో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వీరిద్దరు కూడా సీమాంధ్రకు చెందినవారే. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఎపి ఎన్జీవోలు హెచ్చరించారు.
ఎగతాళి చేసిన ఆందోళనకారులు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఆందోళనకారులు తమ ప్రాంతానికి చెందిన నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బొమ్మలకు చీరలు కట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సచివాలయంలో నిరసన ప్రదర్శన
ఆంధ్ర ఉద్యోగులు శనివారంనాడు రాష్ట్ర సచివాలయంలో నిరసన ప్రదర్శన చేశారు. కెసిఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శైలజానాథ్ను, కాంగ్రెసు శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డిని అడ్డుకున్నారు.
సీమాంధ్రలో నిరసన మంటలు
సీమాంధ్రలో ఆస్తుల ధ్వంసం జరుగుతోంది. ఆగ్రహించిన ఆందోళనకారులు వివిధ చోట్ల విధ్వంసానికి దిగారు. నెల్లూరులో టైర్లను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
తిరుపతిలో ఇలా..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. తిరుపతిలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తూ ఇలా... తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నిరసనలో హోరెత్తుతోంది.
తిరుపతిలో ర్యాలీ..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసనలోకి విద్యార్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలే కాకుండా ప్రభుత్వోద్యోగులు కూడా దిగారు