కిరణ్ నాయకత్వంలో సమైక్య ఇందిర కాంగ్రెస్!?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తపనపడ్డారని, అనివార్యమైన పరిస్థితులు ఏర్పడితే 'సమైక్య రాష్ట్ర ఇందిరా కాంగ్రెసు' అనే పార్టీ వచ్చినా రావొచ్చునని రౌతు చెప్పారు. మరికొద్ది రోజులు ఆగితే స్పష్టత వస్తుందన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి ఒక నేత వస్తారని, అది ముఖ్యమంత్రి కిరణ్ అయినా కావొచ్చన్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసే నాటికి సంచలనాలు బయటకు వచ్చే అవకాశముందని, విభజనపై కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే పార్టీకి కూడా రాజీనామా చేస్తానన్నారు. రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరుతారని ప్రశ్నిస్తే... సమైక్య రాష్ట్ర ఇందిరా కాంగ్రెసు పెడతారేమోనని చెప్పారు.
జై ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు కూడా ఇందిరా గాంధీ సమైక్యానికే మొగ్గు చూపారన్నారు. మరోవైపు తన వ్యాఖ్యలపై రౌతు ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పార్టీ ఆధ్వర్యంలో జరగనున్నట్లు చెప్పలేదని, ఇందిరా గాంధీ ఆశయాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరుతామని చెప్పడమే తన ఉద్దేశ్యమని ప్రకటన విడుదల చేశారు.