కెసిఆర్ పైనా సీమాంధ్రుల ఆశ: టికి బ్రేక్ పడ్తుందా?
రాష్ట్ర విభజన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా? తెలంగాణపై వేగంగా అడుగులు వేస్తున్నామని చెబుతున్న కాంగ్రెసు పార్టీ ఏదో కారణంతో మళ్లీ వెనుకడుగు వేస్తుందా? అంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అవుననే భరోసా వ్యక్తం చేస్తున్నారనే చెప్పవచ్చు. విభజన నిర్ణయాన్ని ఎలాగైనా ఆపాలని వారు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. సమైక్యవాదిగా ముద్రపడి ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు మళ్లీ ఇప్పుడు సమైక్యవాదం లేదా హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రమంటూ డిమాండ్ చేస్తున్నారు.
సమైక్యవాదమే తమ మొదటి డిమాండ్ అని, విభజన అనివార్యమైతే హైదరాబాదుపై తేల్చాలని చెబుతున్న కేంద్రమంత్రులు హైదరాబాదుపై తమకు స్పష్టత రాకుంటే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. మరోవైపు ఆహార బిల్లుపై ఓటింగ్ అంశం కాంగ్రెసు పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ నేపథ్యంలో విభజన అంశం మళ్లీ వెనక్కి వెళ్లవచ్చునని సీమాంధ్ర నేతలు అంటున్నారు.

కావూరి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. 'విభజన ప్రతిపాదన అసలు కేంద్ర మంత్రివర్గం ముందుకే రాదు. కేబినెట్ నోట్ తయారు కాకముందే ప్రక్రియ ఆగిపోతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది' అని చెప్పారు. కావూరి మాత్రమే కాదు.. పలువురు సీమాంధ్ర నేతలూ ఇదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ ధీమాకు వారు రకరకాల కారణాలను ఉటంకిస్తున్నారట.
సిడబ్ల్యూసి విభజన అభిప్రాయాన్ని ప్రకటించినప్పటి నుండి సీమాంధ్రలో ఉద్యమం రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమం ఉంటుందని కాంగ్రెసు పార్టీ ఊహించలేదని, ఈ పరిస్థితిలో తెలంగాణపై ముందుకు వెళ్తే సీమాంధ్రలో పార్టీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని, ఒక్క సీటు కూడా రాదని, కెసిఆర్ పుణ్యమా అని తెలంగాణలో నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ రాదని, సర్వేలు కూడా అలాగే చెబుతున్నాయని కొందరు భావిస్తున్నారు.
సీమాంధ్రలో భారీ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తప్పదని ముందుకు వెళ్తే పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసులోకి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆ రెండు పార్టీలలోకి వెళ్లలేని వాళ్లు కొత్త పార్టీ పెట్టే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని, ఆ పార్టీ నేతలో కొత్త పార్టీ అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారని అంటున్నారు.
సీమాంధ్ర నేతలు, ప్రజలు హైదరాబాద్, నదీ జలాల సమస్యపై తమకు స్పష్టత కావాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాదును ఎన్నో ఏళ్లుగా అందరం కలిసి నిర్మించుకున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అది తెలంగాణకే అంటే ఎలా అంటున్నారు. నదీ జలాల సమస్య అతిపెద్దగా మారే అవకాశముందని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. మరోవైపు తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఊపందుకున్నాయి.
గూర్ఖాలాండ్, విదర్భ, బోడోలాండ్ తదితర ప్రాంత నేతలు సభలో ఆందోళన చేస్తున్నారు. పలు పార్టీలు కూడా తెలంగాణతో చిచ్చు రాజేశారని కాంగ్రెసు పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రావడం ఇష్టం లేదని, సమస్యను ఏదో రకంగా ఆయన వివాదం చేస్తారని, తెలంగాణపై అధిష్టానం వెనక్కి తగ్గేలా చేసే అవకాశాలు లేకపోలేదని మరికొందరు భావిస్తున్నారట. నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పరోక్షంగా సమైక్యవాది అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications