మోడీ చివరి ప్రయత్నం: భేటీ కానున్న చంద్రబాబు, కేసీఆర్!
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు ప్రాజెక్టులు కడితే కృష్ణా నదిలో చుక్క నీరు కూడా తమకు అందదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చేసిన యత్నాలు ఫలించలేదు.

ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఏమాత్రం ఫలితాన్నివ్వకపోగా, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను మరింతగా పెంచాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రిత్వ కార్యాలయం మరోమారు ఈ వివాద పరిష్కారానికి యత్నించాలని కేంద్ర జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఉమాభారతి ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖాముఖీ కూర్చోబెట్టి చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుంది గ్రహించారు. ఇదే విషయాన్ని ఆమె ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్లకు తెలియజేశారు.
తాజాగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాల సీఎస్లకు విడివిడిగా లేఖలు రాశారు. ఈ నెల 11, 18, 19 తేదీల్లో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య భేటీకి తాము సిద్ధంగా ఉన్నామని, మీ మీ సీఎంలకు అనుకూలమైన తేదీలను తెలిపితే భేటీని ఖరారు చేస్తామని ఆ లేఖలో అమర్ జిత్ సింగ్ పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై ఏపీ అభ్యంతరాల నేపథ్యంలో సుహృద్భావ వాతావరణంలో వివాదాన్ని పరిష్కరించుకునేలా చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్రం లేఖలో పేర్కొంది. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రత్యుత్తరం అందిన వెంటనే తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం కీలక భేటీని నిర్వహించనుంది.
ఈ కీలక చర్చలకు సంబంధించిన షెడ్యూల్, వేదిక అతి త్వరలోనే ఖరారు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధమని, జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ రైతు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు సహా ఇతరులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లో నష్టం జరగకుండా చూడాలని ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జలసంఘం, కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం నిబంధనల మేరకు జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ కోర్టుకు తెలిపింది.












Click it and Unblock the Notifications