‘పెద్ద’ స్నేహం: కేసీఆర్! కొండంత అండనిచ్చారని మోడీ ప్రశంస
పెద్ద నోట్ల రద్దు అంశంపై పలుమార్లు ప్రధాని మోడీతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రంతో సత్ససంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో భాగం కాకపోయినప్పటికీ ఆయన..
న్యూఢిల్లీ/హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అంశంపై పలుమార్లు ప్రధాని మోడీతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రంతో సత్ససంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో భాగం కాకపోయినప్పటికీ ఆయన.. మోడీతో స్నేహం చేస్తుండటం గమనార్హం. పెద్దనోట్ల రద్దు విషయంలో మొదట కొంత వ్యతిరేకత ప్రదర్శించినప్పటికీ.. ప్రధానితో భేటీ తర్వాత మాత్రం కేసీఆర్.. కేంద్ర నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు.

స్నేహపూర్వకమే
పార్లమెంటులో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలకవద్దని తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు కేసీఆర్. అంతేగాక, మంత్రులు, నేతలు కూడా పెద్ద నోట్ల రద్దుపై వ్యతిరేకంగా విమర్శలు చేయడకూడదని చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ప్రయోజనాల నేపథ్యంలోనే కేసీఆర్.. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మొదట వ్యతిరేకించినా..
ఈ నేపథ్యంలో, నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ స్వాగతించారని, ఆయన మద్దతు తనకు కొండంత బలాన్ని ఇచ్చిందని మోడీ పేర్కొన్నారు.

మోడీ ప్రశంసలు
రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు తాను ప్రకటించిన వెంటనే సీఎం కేసీఆర్ స్పందించారని, దీనిపై అధ్యయనం చేశారని, భవిష్యత్తులో ఫలితాలు ఏవిధంగా ఉంటాయన్న విషయంపై తనతో చర్చించి పలు సూచనలు కూడా చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ అందించిన సహకారాన్ని మరువలేనని తెలిపారు.

అడిగి తెలుసుకున్నారు
కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ సీఎం కేసీఆర్ రాసిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా నగదు రహిత లావాదేవీలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. సుమారు పావుగంట సేపు జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.

తొలి నగదు గ్రామం
దక్షిణాదిలోనే తొలి నగదు రహిత గ్రామంగా సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ను తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టామని ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్కుమార్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ప్రధానికి వివరించారు. భేటీ అనంతరం జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రదీప్చంద్ర పదవీకాలాన్ని పొడిగించడానికి సానుకూలంగా స్పందిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్టు చెప్పారు.

ప్రధాని సంతోషం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై ప్రధాని సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంట్లో నోట్ల రద్దు నిర్ణయంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతూనే సభా కార్యకలాపాలు జరుగకుండా అడ్డుకుంటున్న సమయంలో 193వ నిబంధన కింద చర్చకు టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చొరవను అభినందించారని తెలిపారు.

మోడీ హామీ
నోట్ల రద్దు అనంతరం తెలంగాణ రాష్ర్టానికి ఏర్పడిన ఆర్థిక నష్టం, కేంద్రం నుంచి లభించాల్సిన ఆర్థిక సాయం తదితరాలపై చర్చించేందుకు సమయం కావాలని ప్రధానిని అడిగామని, పార్లమెంట్ సమావేశాల అనంతరం తప్పకుండా కలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఎంపీలు వివరించారు.












Click it and Unblock the Notifications