అసెంబ్లీ స్థానాల పెంపు: కెసిఆర్పై ఢిల్లీ పెద్దల స్కెచ్?

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పడం, క్రెడిట్ ఆ పార్టీకి, బిజెపికి వెళ్లనున్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలను పెంచి ప్రధానంగా తెరాసను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
అసెంబ్లీ స్థానాలు పెంచకపోతే తెలంగాణ మరో జార్ఖండ్ అవుతుందని, రాజకీయ అస్థిరత నెలకొంటుందని మర్రి చేసిన ప్రతిపాదన వెనుక అధిష్ఠానం ఉండవచ్చుని చెబుతున్నారు. స్వయంగా సోనియా గాంధీ సూచనల మేరకే ఆయన రంగంలోకి దిగి ఉండవచ్చునని చెబుతున్నారు.
దీని వెనుక తెలంగాణలో తెరాసను దెబ్బతీయాలనే దీర్ఘకాలిక వ్యూహం ఉందంటున్నారు. తెలంగాణలోని 119 స్థానాలను 153కు పెంచాలని మర్రి విన్నవించారు. స్థానాలు పెరిగే కొద్దీ తమకు లబ్ధి చేకూరుతుందని, మెజారిటీ సీట్లు సాధించేందుకు వీలుంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట.
పెరిగే స్థానాల్లో ఎక్కువ భాగం హైదరాబాద్తోపాటు రాజధాని శివారు జిల్లాల్లోనే ఉంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సహజంగానే తెరాస బలం తక్కువని, అక్కడ స్థానాల సంఖ్యను పెంచడం ద్వారా తెరాస ప్రాబల్యాన్ని దెబ్బతీయవచ్చునన్నది కాంగ్రెస్ వ్యూహకర్తల భావనగా చెబుతున్నారు.
కెసిఆర్, తెరాస నేతలు సీమాంధ్ర నేతలను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు టాస్క్ఫోర్స్ కమిటీ, ఆంటోనీ కమిటీ నివేదికలు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో సోనియా గుర్రుగా ఉన్నారట. తెరాసను ఎదుర్కొనేందుకు నేతలను సిద్ధం చేయాలని ఆదేశించారట. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని పైకి తెచ్చారని అంటున్నారు. కాగా ఈ ప్రతిపాదన తన సొంతమని మర్రి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications