ఏం చేద్దాం?: ఎమ్మెల్యేల నుండి కెసిఆర్ ఆరా
కెసిఆర్ ఇప్పుడు అభిప్రాయాలు సేకరిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు పార్లమెంటులో ఆమోదం పొందాకనే కెసిఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ విషయాన్ని కెసిఆర్, ఆ పార్టీ పలుమార్లు చెప్పింది.
ఢిల్లీలో ఉన్న కెసిఆర్ తాను తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవసరమైతే విలీనానికి కూడా సిద్ధంగా ఉన్నారంటున్నారు. అయితే ఆయన మొదటి ప్రాధాన్యత మాత్రం పొత్తుకే అని తెలుస్తోంది. అలాగే పార్టీ నాయకుల అభిప్రాయాన్ని కూడా ఆయన తీసుకుంటున్న నేపథ్యంలో దానిని బట్టి నడుచుకునే అవకాశాలు లేకపోలేదు. ఎక్కువ మంది విలీనంకే మొగ్గు చూపుతున్నారట.
కాంగ్రెసు పార్టీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెసు పార్టీ తీరు ఆశించినంతగా ఉండదని, ఏళ్లుగా పోరాడిన తెరాసకు, ఉద్యమంలో పాల్గొన్న బిజెపి, సిపిఐ వంటి పార్టీలకు ఆదరణ ఉందని, ఎన్నికల ముందు ఓట్ల కోసమే కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందనే అభిప్రాయం చాలామందిలో ఉందని, అందుకే విలీనం వద్దని పలువురు నచ్చచెబుతున్నారట.
ఇటీవల ఆయన ఏఐసిసి అద్యక్షురాలు సోనియా గాంధీతో సహా పలువురు కాంగ్రెసు పెద్దలను వరుసగా కలుస్తున్నారు. వారితో బిల్లులోని సవరణలతో పాటు పొత్తు, విలీనం అంశాల పైన కూడా చర్చ వస్తున్నట్లుగా తెలుస్తోంది.