అద్దె పార్టీ వైపు కిరణ్, జిల్లాల వారిగా లిస్ట్ తయారు
హైదరాబాద్: కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అద్దె పార్టీ వైపు దృష్టి సారించారు. కొత్త పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించుకునేందుకు సమయం చాలదని ఆయన భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే నమోదై ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు.
ఇప్పటికే సీమాంధ్ర నుంచి నాలుగు కొత్త పార్టీలను కొంతమంది నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఒక పార్టీ దరఖాస్తు చివరి దశలో ఉన్నట్టు సమాచారం. ఆ పార్టీని గానీ, మిగిలిన మూడు పార్టీల్లో ఒక దానిని గానీ తీసుకుని ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న కోణంలో కిరణ్ ఆలోచన చేస్తున్నారు.
ఇదే అంశంపై మంగళవారం పార్లమెంటు సభ్యులు కొంతమంది మంత్రులు, ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీలో ప్రస్తావించినట్టు సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయమైన నేపథ్యంలో, పార్టీ ఏర్పాటు విధానంపైనా కిరణ్ సమాలోచనలు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో కొత్త పార్టీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు.
రోజుల సమయంలోనే కొత్త పార్టీపై దరఖాస్తు చేసుకోవడం, అనుమతి పొందడం సాధ్యం కాదని భావిస్తున్న ఆయన, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నాలుగు పార్టీల ప్రతినిధులతో చర్చించారట. సమైక్యం పేరు, జనంలోకి వెళ్లేలా ఉన్న పేరుగల పార్టీని ఎంచుకునేందుకు సిద్ధమయ్యారట.
ఈ నేపథ్యంలోనే జై సమైక్యాంధ్ర పార్టీ పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి గుర్తుగా పాదరక్షలు కూడా అనుకుంటున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్త పార్టీ అంశంతో పాటు, పార్టీలోకి వచ్చే వారి వివరాలపైనా ఎంపీలతో చర్చించారు. పార్టీలోకి వచ్చే వారి లిస్టు తయారు చేస్తున్నారు.