భవిష్యత్తు: కిరణ్ రెడ్డితో బహిష్కృత ఎంపీలు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన కొత్త పార్టీ పెడుతారా, కొంత కాలం ప్రవాసంలోకి వెళ్లిపోతారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి రేపు ఆదివారం తన వర్గం నాయకులతో సమావేశం కానున్నారు. తనతో నడిచేవారెవరో కిరణ్ కుమార్ రెడ్డి రేపు తేల్చుకుంటారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరణకు గురైన పార్లమెంటు సభ్యులు హర్షకుమార్, సబ్బం హరి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావు, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్లతో కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సమావేశం కానున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు ఎంపీలు కూడా కిరణ్తో సమావేశం అవుతారని భావిస్తున్నారు. వారు ఈ విషయాన్ని శుక్రవారం కిరణ్తో చెప్పారని కూడా అంటున్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసి, పార్లమెంటు సభ్యులంతా రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సమావేశాన్ని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కొత్త పార్టీని పెట్టాలని ఆయనపై కొంత మంది నుంచి ఒత్తిడి ఉంది. దీంతో ఎంపీలతో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా పలువురు తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు ముఖ్యనేతలను ఆహ్వానించాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడం ఖాయమని తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. కిరణ్ వెంట తాను నడుస్తానని కూడా చెప్పారు. సమైక్యవాదం కోసం పోరాడిన కిరణ్కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మంత్రి తోట నరసింహం కుమార్తె వివాహానికి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన కిరణ్ సోదరుడిని జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నబాబు, వంగా గీత, రాజా అశోక్బాబు కలిశారు. కొత్తపార్టీపై వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే.