అగ్రవర్ణాలు ప్లస్ ఓబీసీ ప్రయోగంపై మిశ్రమ ఫలితాలు: తుది దశకు సంఘ్ సై
తొలి రెండు దశల పోలింగ్లో ఆశలు పెట్టుకోని బీజేపీ.. తదుపరి మూడు దశల్లో విజయావకాశాలపై ఆశాభావంతో ఉన్నది.
లక్నో: తొలి రెండు దశల పోలింగ్లో ఆశలు పెట్టుకోని బీజేపీ.. తదుపరి మూడు దశల్లో విజయావకాశాలపై ఆశాభావంతో ఉన్నది. దీనికి కారణం అగ్రవర్ణాలకు చెందిన 20 %, యాదవేతర ఓబీసీలకు చెందిన 32 శాతం ఓటర్లను కలగలుపుకుని పోవాలని బీజేపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం అగ్రవర్ణాలు, ఇతర సామాజిక వర్గాల్లో మిశ్రమ స్పందన కానవస్తున్నది.
యాదవేతర ఓబీసీల్లో కేశవ ప్రసాద్ మౌర్య, స్వామి ప్రసాద్ మౌర్యలకు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు కమలనాథులు. శాక్యా - కుశ్వాహా సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులే బీజేపీలో 35 శాతానికి పైగా ఉన్నారు. కుశ్వాహాలు - శాక్యాలు ఓబీసీల్లో ఏడెనిమిది శాతం మంది ఓటర్లు. పలు సీట్లు బ్రాహ్మణులు, ఠాకూర్లకు ఇవ్వడం ద్వారా అగ్రవర్ణాలను సంత్రుప్తి పరిచింది బీజేపీ.
ఒకవేళ కుశ్వాహాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తే కేశవ ప్రసాద్ మౌర్యను సీఎం అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని సంతోశ్ కుమార్ అనే కుశ్వాహా సామాజిక వర్గ యువకుడు ప్రశ్నిస్తున్నాడు. మరో అజయ్ కుశ్వాహా మాత్రం ఎస్పీ వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వస్తున్నాడు.
మధ్య యూపీ, బుందేల్ఖండ్ తదితర ప్రాంతాల్లో లోధ్ రాజ్ పుత్రులు బీజేపీలో వెళ్తామని చెప్తున్నా.. కొన్ని స్థానాల పరిధిలో అభ్యర్థుల కుల సమీకరణాలను బట్టి పరిస్థితులు మారిపోతాయంటున్నారు. యాదవులు తొమ్మిది శాతం, శాక్యాలు - కుశ్వాహలు ఏడెనిమిది శాతం పోతే మిగతా యాదవేతర ఓబీసీ కులాల ప్రజలు తమ సామాజిక వర్గాల అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నారు.
జాతవేతర దళితులు, యాదవేతర ఓబీసల మద్దతుపై ఆశలు
సీఎస్డీఎస్ డాటా ప్రకారం 2014లో మోదీ హావాలో 60 శాతం యాదవేతర ఓబీసీల మద్దతు పొందింది. 2012లో ఎస్పీ 30 శాతం ఓట్లు పొందితే, అంతకుముందు 2007లో బీఎస్పీకి ఇదే లాభించింది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వస్తాయని కమలనాథులు భావించడం లేదు. 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బ్రాహ్మణులు, ఠాకూర్ల మద్దతు 2014లో బీజేపీ 75 % పెరిగింది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు. అయితే బ్రాహ్మణులు అత్యధికంగా ఉండే ఐదో దశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 15% ఓటు కలిగి ఉన్న బీజేపీ కనీసం 50 శాతం జాతవేతర దళితుల మద్దతు పొందగలమని భావిస్తున్నది. అగ్రవర్ణాల్లో కనీసం 27 శాతం ఓటు తమకు సంఘటితమవుతుందని అంచనా వేస్తున్నది.
తుది దశకు ఆరెస్సెస్, బీజేపీ సంయుక్తంగా ఇలా..
ఇక చివరి దశ పోలింగ్ సందర్భంగా ప్రతి కార్యకర్త, మద్దతుదారుడిని కూడగట్టేందుకు బీజేపీ, దాని మార్గదర్శక సంస్థ ఆర్ఎస్ఎస్ అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేశాయి. శనివారం ఆరోదశ పోలింగ్ ముగియడం, బుధవారం చివరి దశ పోలింగ్ కోసం రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్రమోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభా నియోజక వర్గ పరిధిలో వరుసగా రెండు రోజులూ రోడ్ షోలు నిర్వహించి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రోడ్ షోలకు భారీగా వేల సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు బీజేపీకి ఉన్న మద్దతును తెలియజేశారు. రెండున్నరేళ్ల క్రితం వారణాసి లోక్సభ స్థానంలో జరిగిన భారీ రోడ్ షో తర్వాతే ఇదే అతిపెద్ద రోడ్ ప్రదర్శన.
చివరి మూడు దశలపైనే కమలం ఆశలు
తొలి నాలుగు దశల పోలింగ్ల్లో మోదీ హవాగానీ, బీజేపీ ప్రభంజనంగానీ కనిపించలేదు. కానీ ఐదో దశ పోలింగ్ నుంచి క్రమంగా మొదలైన బీజేపీ హవా ఆరో దశకే ఉన్నత శిఖరానికి చేరుకున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. చివరి రెండు దశల్లోనే ‘కమలం' వికసిస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు నేతలకు టిక్కెట్లు ఇచ్చే విషయమై తొలి రెండు దశల పోలింగ్ వరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కొనసాగిన విభేదాలను సంఘ్ పరివార్ పక్కనబెట్టి బీజేపీతో గల విభేదాలను పక్కనబెట్టి పార్టీ పక్షాన అత్యధిక ఓట్లు పోలయ్యేలా పార్టీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులను సమయాత్తం చేస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ విభేదాలు పక్కనబెట్టి కలిసి పనిచేస్తున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగా మోదీ హవా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.
హోసాబోలే ఆధ్వర్యంలో సమన్వయం
పార్టీ మద్దతుదారులను ముందుకు నడిపిస్తూ తటస్థులను పార్టీకి అనుకూలంగా మార్చడంలోనూ, ఎటు వెళ్లాలో తెలియని వారిని తమవైపుకు తిప్పుకోవడంలో సంఘ్ శ్రేణులు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ‘జన్ జాగరణ్' పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఆరెస్సస్ కార్యకర్తలు ముందుకు వెళుతున్నారు. జాతీయతా వాదం సాక్షిగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ విజయంలో సంఘ్ స్వయంసేవక్లు, అనుబంధ సంస్థల కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారని, జాతీయ పార్టీగా బీజేపీకి ఓటేయిస్తారని ఆరెస్సెస్ నేత ఒకరు చెప్పారు.
ఆరెస్సెస్ ఎన్నికల వ్యూహమిలా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని క్షేత్రాలుగా, ప్రాంతాలుగా విభజించిన సంఘ్ పరివార్.. ఆరు ప్రాంతాలుగా చేసింది. అవధ్, కాశీ, పశ్చిమ, గోరఖ్ పూర్, బ్రిజ్, గోరక్ష ప్రాంతాలుగా విభజించింది. ప్రతి ప్రాంతాన్ని డివిజన్లుగా, జిల్లాలుగా, మహా నగరాలుగా విభజించింది. రెండు ప్రాంతాలకు ఒక క్షేత్ర ప్రముఖ్ను ఇన్చార్జీగా ప్రచార కార్యక్రమాలను నిర్దేశిస్తున్నది. సంఘ్ పరివారానికి ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి హోసాబలే దత్తాత్రేయ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఎప్పటికప్పుడు సర్వేలు, సమావేశాల నిర్వహణ ద్వారా సమాచారాన్ని మదిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు సాగిందీ ఆరెస్సెస్. జాతవేతర దళితులు, యాదవేతర ఓబీసీలను తమ వైపును తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది.
నో నోట్ బందీ ఎఫెక్ట్
ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు అంతా గతమని, క్షేత్రస్థాయిలో సగటు ఓటరు, రైతులు, కార్మికుల నుంచి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. నగదు కొరత ఏర్పడినా ప్రజలు నోట్ల రద్దును స్వాగతించారని చెప్తున్నారు. దీనికి బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలే కారణమని అంటున్నారు.