ప్రాంతీయ పార్టీలదే హవా: కన్రడ్ సంగ్మాపై మేఘాలయన్ల కోటి ఆశలు
షిల్లాంగ్: ఈశాన్య భారత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నాకొద్దీ ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, వాటి ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ముకుల్ సంగ్మా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు కన్రడ్ సంగ్మా నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. కన్రడ్ సంగ్మా లోక్ సభ మాజీ స్పీకర్ పీ ఏ సంగ్మా తనయుడు.
అంతేకాదు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ), గ్యారో నేషనల్ కౌన్సిల్ (జీఎన్సీ) కూటమి నుంచి అరుదైన సవాల్ ఎదురవుతోంది. ఖాసీ, జైనితా హిల్ పర్వత ప్రాంతాల్లో యూడీపీ, హెచ్ఎస్డీపీ పట్టు కలిగి ఉండగా, గ్యారో హిల్స్ ప్రాంతంలో జీఎన్సీదే కీలక పాత్ర అని విశ్లేషకులు చెపుతున్నారు.
1972లో మాత్రమే ఏపీహెచ్ఎల్సీ ఆధ్వర్యంలో సర్కార్ ఏర్పాటు
ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా మారితే మేఘాలయ రాజకీయ చిత్రాన్ని ఎవరూ మార్చలేరు. అలాగే ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం లేదంటే అతిశయోక్తి కాదు. కాకపోతే 1972లో మేఘాలయ రాష్ట్రావిర్భావం తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (ఎపీహెచ్ఎల్సీ) సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
జైనితాస్, ఖాసీ ప్రాంతాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శలు
మేఘాలయ ప్రజల ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి ప్రగతి.. రెండోది ఉపాధి కల్పన. కాంగ్రెస్ పార్టీని చాలాకాలంగా పరీక్షించారు. ఇక బీజేపీ మేఘాలయలో భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో అడుగు పెట్టేందుకు సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో మేఘాలయలో ప్రాంతీయ పార్టీలు మాత్రమే మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే తమ ప్రాంత సమస్యలను అర్థం చేసుకుంటారని స్థానికులు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లోక్ సభ మాజీ స్పీకర్ పీ ఏ సంగ్మా హయాంలో మాత్రమే తుర కొండల్లోని అంపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది ఈ ప్రాంత అభివ్రుద్ధిపై ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. జైనితాస్, ఖాసీలను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలకు ఇవ్వన్నీ సమస్యలని భావించడం లేదు.
తుర హిల్స్లో ఎన్పీపీదే హవా
మేఘాలయ మూడు ప్రాంతాలుగా విభజించింది. తుర హిల్స్, ఖాసీ కొండలు, జైనితా హిల్స్. రీభోయి జిల్లాతోపాటు తుర హిల్స్ లో 24, ఖాసీ కొండల్లో 29, జైనితా కొండల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్పీపీ కేవలం తుర హిల్స్లో పలుకుబడి ఉన్నది. క్రమంగా ఇతర ప్రాంతాల్లో పట్టు సాధించే దిశగా అడుగులేస్తుననది. మిగతా రెండు ప్రాంతాల్లో యూడీపీ, హెచ్ఎస్పీడీపీ సంప్రదాయంగా బలమైన ప్రాంతీయ పార్టీలు. గమ్మత్తేమిటంటే ఏ ప్రాంతీయ పార్టీకి కూడా రాష్ట్రమంతటా పట్టు లేదు. సంప్రదాయంగా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మేఘాలయ ప్రజలు ఓటేస్తూ వచ్చారు.
బలం పుంజుకోని ప్రాంతీయ పార్టీలిలా..
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలైనా అంత బలంగా లేవన్న అభిప్రాయం ఉన్నది. అయితే క్రమంగా ఎన్పీపీ బలం పుంజుకుంటున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్పీపీని పీఏ సంగ్మా 2013లో ఏర్పాటు చేశారు. అంతకుముందు 2012లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో విభేదాలతో బయటకు వచ్చిన పీఏ సంగ్మా సొంత పార్టీ ఏర్పాటు చేసినా 2016లో మరణించారు. పీఏ సంగ్మా మరణం తర్వాత పలువురు ఓటర్లు ఆయన కుమారుడు కన్రడ్ సంగ్మా పట్ల సానుకూలంగా ప్రతిస్పందించారు.
బీజేపీతో కన్రడ్ జత కడతారని సందేహాలు
ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి సాగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే ప్రాంతీయ పార్టీలు బలోపేతం అయ్యేవి. కానీ ఈ దఫా కన్రడ్ సంగ్మా ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టగలరన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యువ నాయకుడిగా మేఘాలయ రాష్ట్ర భవితవ్యాన్ని మార్చేస్తారని స్థానికులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ఎన్నికల తర్వాత బీజేపీతో ఎన్పీపీ జతకట్టే ముప్పు ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో బీజేపీకి ఎన్పీపీ మిత్ర పక్షం. ఈశాన్య ప్రజాతంత్ర కూటమి (ఎన్ఈడీఏ)లో ఎన్పీపీ, యూడీపీ భాగస్వామ్య పక్షాలే. ఎన్పీపీ నేత కే స్యైమ్ సుగ్నా మాట్లాడుతూ మణిపూర్ పరిస్థితులకు, మేఘాలయ పరిస్థితులకు చాలా తేడా ఉన్నదని చెప్పుకొచ్చారు. బీజేపీతో మేఘాలయలో పొత్తు పెట్టుకోబోమని వ్యాఖ్యానించారు.