కాంగ్రెసు చిచ్చు: తెలుగుదేశం తెలంగాణ పార్టీ?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ తీయడానికి కాంగ్రెసు పార్టీ వ్యూహం రచించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి కాంగ్రెసు వ్యూహాన్ని రచించి, అమలు చేస్తోందని ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. ఆ వార్తాకథనం వివరాలు ఇలా ఉన్నాయి - తెలంగాణ ప్రకటన తర్వాత తమతో సంబంధాల్లోకి వచ్చిన నేతలను ప్రోత్సహించి కొత్త పార్టీ ఏర్పాటు చేయించాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేదా తెలంగాణ తెలుగుదేశం ఫోరం పేరుతో ఈ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడిన తర్వాత తెలంగాణలో ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలను తమ వైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ నాయకత్వం గట్టి ప్రయత్నం చేసింది. కొంత మందితో ఢిల్లీ పెద్దల ద్వారా, మరి కొంత మందితో స్థానిక నాయకుల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కొద్ది మంది నుంచి ఆ పార్టీకి కొంత సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు.
కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహం మారింది. ఇద్దరు ముగ్గురు నేతలను తీసుకుంటే వారి నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం ఉంటుందని, దాని బదులు ఆ నేతలతో ఒక పార్టీ పెట్టించి టీడీపీలో చీలిక వచ్చిందన్న వాతావరణం ఏర్పరిస్తే ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం ఏర్పడి ఎక్కువ చోట్ల నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చిందని అంటున్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ దీక్ష తర్వాత తెలంగాణలో తమ పరిస్థితి మారిందని, అందవల్ల అటువంటి ఆలోచన చేయక తప్పడం లేదని తెలంగాణ ప్రాంత నాయకులు కొంత మంది అన్నారు. రాజకీయ పార్టీ పెట్టడం, నడపడం, ఎన్నికల్లో పోటీకి దిగడం భారీ ఖర్చుతో కూడుకొన్నవి కావడంతో ఆ దిశగా తమ సహకారం ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల తర్వాత కావాలంటే ఈ కొత్త పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికి కూడా అభ్యంతరం లేదని, అందులోని వారికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం ఉండేలా చూస్తామని కూడా వారు హామీలు గుప్పిస్తున్నారని అంటున్నారు.