పెళ్లి గుర్రాలకు నో: రాహుల్ గాంధీ పిట్టకథ
న్యూఢిల్లీ: 'రేసు గుర్రాలకే టికెట్లిస్తాం. పెళ్లి గుర్రాలను పక్కన పెడతాం' అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్ రాహుల్ గాంధీ పార్టీ క్యాడర్కు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన ఏఐసిసి భేటీకి రాష్ట్రం నుంచి హాజరైన డెలిగేట్లు, ఎంపీలతో శనివారం ఉదయం కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ పటిష్టతకు కృషి చేసేవారికే గుర్తింపు ఉంటుందన్నారు.
వరుడిని ఊరేగించడానికి ఉపయోగించేది పెళ్లి గుర్రమని, దీన్ని ఎంత అలంకరించినా పెళ్లికి తప్ప ఇంకెందుకూ పనికి రాదని, రేసు గుర్రాలు ఇందుకు భిన్నమని, వీటిని అనునిత్యం పరిగెత్తించాలని, విజయం కోసం కఠిన శిక్షణ ఇవ్వాలని, తర్ఫీదు పొందిన గుర్రాలే రేసుల్లో గెలుస్తాయని, రేసులకు పెళ్లి గుర్రాలను దించితే అపజయాలు తప్పదని, ఇంతవరకు మనం పెళ్లి గుర్రాలనే రేసు గుర్రాలనుకుని ఎన్నికల బరిలో దించి విఫలమయ్యామని, ఇకమీదట అలాంటి తప్పులు జరగవని, రేసు గుర్రాలనే బరిలోకి దించుతామని రాహుల్ పిట్టకథతో ఆకట్టుకున్నారు.

పార్టీ తర్ఫీదు పొంది ప్రజల్లో తిరిగే వారికే పార్టీ టికెట్లు అందుతాయని పరోక్షంగా హెచ్చరించారు. మూడ నెలల్లో పార్టీని సమూలంగా మార్చలేమని, అది సాధ్యం కాదన్నారు. కానీ, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, వాటిలో మనం పోరాడాలని, ఇందుకోసం అంతా ఐక్యంగా యుద్ధప్రాతిపదికన కష్టపడాలని సూచించారు. ఫొటోలకు పోజులిచ్చేవి కాదు రేసు గుర్రాలే మనకు కావాలన్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జెడి శీలం, ఎంపీలు చింతామోహన్, కెవిపి రామచంద్ర రావు, పిసిసి ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం తదితరులు, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం, మంత్రి గీతా రెడ్డిలతో పాటు దాదాపు అందరు ఎంపీలు పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షుల్లో సైతం ఎక్కువ మంది తెలంగాణ వారే హాజరయ్యారు. పిసిసి చీఫ్ బొత్స గైర్హాజరయ్యారు. రాహుల్ సమావేశానికి వెళ్లిన వారిలో 75 శాతం మంది తెలంగాణ వారే ఉండటం గమనార్హం.
రాష్ట్రానికి చెందిన ఏఐసిసి డెలిగేట్ల నుంచి ముగ్గురికి మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వాల్, మజ్జి శారద, మాదాసు గంగాధరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను రాహుల్కు వివరించారు.












Click it and Unblock the Notifications