10+2కు కెసిఆర్ నో: మలి ఉద్యమానికి సిద్ధం
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహంతో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం రాయల టికే మొగ్గు చూపితే మరో ఉద్యమానికి తెరాస సమాయత్తమవుతోంది. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని, అలా కాకుంటే తాము మళ్లీ ఉద్యమానికి సిద్ధమని తెరాస చెబుతోంది. తాము ఇన్నాళ్లు పోరాటం చేసింది తెలంగాణ కోసమని, రాయల టి కోసం కాదంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరకాదని తెరాస నిర్ణయించింది. ఎవరూ అడగకపోయినా రాయల టి ఆలోచన చేయడంపై కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయల టిపై తెరాస ఆచితూచి స్పందిస్తోంది.

రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం నిజంగానే అడుగులు వేస్తోందా, లేక ప్రజలు, పార్టీల స్పందన తెలుసుకోవడానికి వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిడబ్ల్యూసి, యూపిఏ సమన్వయ కమిటీల్లో పది జిల్లాల తెలంగాణ ఇస్తామంటూ కాంగ్రెసు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిందని చెబుతున్నారు.
జివోఎం నివేదిక, కేబినెట్ భేటీ తర్వాత అధికారికంగా స్పందించేందుకు తెరాస మొగ్గు చూపిస్తోంది. తెలంగాణ పేరుతో అనంతపురం, కర్నూలులను కలిపితే కేంద్ర కేబినెట్ ముసాదియాద బిల్లును ఆమోదించిన మరుక్షణం నుండే ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. బిల్లులో ఏం చెబుతారో చూసిన తర్వాత కార్యాచరణను సిద్ధం చేయాలని తెరాస నిర్ణయించింది.
కెసిఆర్, ఇతర సీనియర్ నేతలు సోమవారం ఢిల్లీకి వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ దానిని వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీకి బిల్లు వచ్చిన తర్వాత ఇక్కడ చర్చలు ముగిసిన తర్వాతనే వెళ్లాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. తొమ్మిదిన లేదా 16న సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక కెసిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications