ఎస్పీ - కాంగ్రెస్ కూటమికి ప్రచారం చేయను: కుండబద్దలు కొట్టిన ములాయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున ప్రచారం చేయబోనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కుండబద్ధలు కొట్టారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) - కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున ప్రచారం చేయబోనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కుండబద్ధలు కొట్టారు. ఎన్నికల్లో సొంత బలంపై పోటీచేసి గెలుపొందే సత్తా ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని మీడియాతో అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు తర్వాత ములాయం సింగ్ యాదవ్ బహిరంగంగా స్పందించడం ఇదే మొదటిసారి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి లక్నో నగరంలో ఉమ్మడి రోడ్ షో నిర్వహించడం పట్ల రెండు పార్టీల పొత్తు పట్ల ములాయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ కూటమి తరఫున ప్రచారంచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ సారథ్యంలోని బిజెపిని ఎదుర్కొనే లక్ష్యంతో యూపీ సీఎం, ఎస్పీ అద్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇంతకుముందు స్థానాలు కేటాయించిన ఎస్పీ నేతల పరిస్థితి ఏమిటని ములాయం ప్రశ్నించారు.
మాది ప్రజల కూటమి: అఖిలేశ్, రాహుల్
తమది ప్రజల కూటమి అని యూపీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచే లక్ష్యంతో తాము హ్రుదయపూర్వక పొత్తు కుదుర్చుకున్నామన్న సంకేతాలిచ్చారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పరస్పరం ఆలింగనాలు, ప్రశంసలతో ముంచెత్తుకున్నారు. శాంతి, ప్రగతి, శ్రేయస్సు (3పీ) ని కోరుకుంటున్నామన్నారు. ప్రధాని మోదీకి ప్రజల బాదలు పట్టవని, ఆయన ఎల్లవేళలా తన మనస్సులో మాట చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని రాహుల్ ఎద్దేవాచేశారు. తమ కూటమికి తామిద్దరం సైకిల్ చక్రాల వంటివారమని రాహుల్, అఖిలేశ్ చెప్పారు. మీడియా సమావేశం తర్వాత లక్నోలో ఆరు కిలోమీటర్ల పొడవునా ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో ముస్లింలు అత్యధికంగా జీవించే ప్రాంతాల మీదుగా సాగింది. తద్వారా ముస్లింలలో భరోసా కల్పించారు. ఈ రోడ్ షోలో సుమారు 15 వేల మంది పాల్గొన్నారు.
అమేథి, రాయబరేలీలలో చెరో ఐదు స్థానాలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేథి లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పొత్తుపై రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీలు చెరో ఐదు స్థానాల్లో పోటీచేస్తాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ 298, కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
కూటమి స్లోగన్ 'యూపీ కో యే సాథ్ పసంద్ హై'
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' సినిమాలోని పాటను అనుకరిస్తూ 'యూపీ కో యే సాథ్ పసంద్ హై' అనే నినాదం ఉత్తరప్రదేశ్ వీధుల్లో హోరెత్తనున్నది. ఇంతకుముందు మూడు నెలల క్రితం యూపీ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు '27 సాల్ యూపీ బెహల్' అని ఇచ్చిన నినాదాన్ని పక్కనబెట్టేశాయి. 27 ఏళ్లుగా యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ మధ్య పొత్తు ఖరారు కావడంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికార సమాజ్ వాదీ పార్టీ, యూపీ సీఎం అఖిలేశ్కు వ్యతిరేకంగా గోడలపై రాసిన నినాదాలను కొట్లేశారు. 'యేహ్ ఐ ఉమీద్ కీ సైకిల్ అవుర్ అధికార్ దేతే హాత్ (హస్తం సాయంతో సైకిల్ అధికారం సాధిస్తాం)' వంటి నినాదాలు ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఫొటోలతో 'బధ్తా జాయేగా ఉత్తర్ ప్రదేశ్ (ఉత్తరప్రదేశ్ భవిష్యత్ లో ఎదుగుతుంది)' అనే పేరుతో విరివిగా పోస్టర్లు ముద్రిస్తున్నారు. కానీ ఇంతకుముందు రాష్ట్రం ప్రగతికి దూరంగా ఉండటానికి కారణం ఎస్పీ ప్రభుత్వమేనని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన పోస్టర్లను ప్రజలు మరిచిపోలేదని చెప్తున్నారు.