అల్లు అరవింద్ ఓట్లకు చిల్లు?
ఈ నియోజకవర్గానికి అరవింద్ కొత్త. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలలో కల పిఆర్పి అభ్యర్ధుల మద్దతు పైనే ఆయన ఆధారపడుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల 5 సెగ్మెంట్లలో నువ్వానేనా అన్నట్లు ఉండగా మరో రెండు సెగ్మెంట్లలో ఆయన రెండవ స్థానంలో ఉన్నారు.
ఆయనకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్కు చెందిన సబ్బం హరి పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కళలో ఆయనది పెట్టింది పేరు. వామపక్షాల మద్దతుతో టిడిపి నూకారపు సూర్యప్రకాశరావును బరిలోనికి దింపింది. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాన పోటీ కాంగ్రెస్, పిఆర్పిల మధ్యే ఉంది. పెందుర్తి, పాయకరావుపేట సెగ్మెంట్లలో టిడిపి-కాంగ్రెస్ల మధ్యే ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీల తరువాత పిఆర్పి మూడవ స్థానంలో ఉంది.
సాంఘిక న్యాయం అంశంపై పిఆర్పి ఆధారపడుతోంది. ఆ పార్టీ జిల్లా కన్వీనర్, అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోని వివిధ గ్రూపులను సమన్వయం చేస్తున్నారు. యలమంచిలి అసెంబ్లీ సెగ్మెంటులో కాంగ్రెస్కు పిఆర్పికి మిశ్రమ స్పందన ఉంది. టిడిపి ఇక్కడ మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ ప్రజలు తాము కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబుకే ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారు.