గుర్తుపై చిరు మెగా ఆందోళన
గుర్తు కోసం ప్రజారాజ్యం న్యాయపోరాటం చేయటం మాట ఎలా ఉన్నా ఉమ్మడి చిహ్నం రాకపోతే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన పార్టీ శ్రేణులను ఇప్పటినుంచే వెంటాడుతున్నది. ఉమ్మడి గుర్తు రాకపోతే ఎన్నికల్లో అతి బలమైన కాంగ్రెస్, మహాకూటమిని ఎదుర్కోవటం కష్టసాధ్యం అని ఇప్పటికే వారు నిర్ణయానికి వస్తున్నారు. ఉమ్మడి గుర్తు లేకుండా అన్ని స్థానాలకు పోటీ చేస్తే పార్టీతో నిమిత్తం లేకుండా స్వంత బలం, బలగం, అర్థబలం ఉన్న ఏ కొద్దిమందికో మాత్రమే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ను ఓడించి అధికారం పగ్గాలు చేపట్టాలనే చిరంజీవి కోరిక నెరవేరటం అంత సులభం కాదని ఇప్పటికే పలువురు నేతలు బహిరంంగా మాట్లాడుతున్నారు.
అదీ కాక తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఉండబోయే వారు నిష్కళంకులుగా, ప్రజాసేవ పరమార్థంగా కలిగిన వారుగా, నేర చరిత్ర లేని వారుగా ఉండాలని ప్రజారాజ్యం మొదటినుంచీ చెబుతున్నది. అలాంటి వారు ఉన్నా, ఉమ్మడి గుర్తు రాకపోతే వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న పిఆర్పీ నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది. 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఉమ్మడి గుర్తు లభించి, కాంగ్రెస్తో పొత్తులో బరిలో దిగినా ఆపార్టీ పోటీ చేసిన స్థానాల్లో సగానికి పైగా మాత్రమే గెలవటాన్ని పిఆర్పీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.