బావ వంతు: పాలిటిక్స్లో బ్రదర్ అనిల్ కీ రోల్
షర్మిల తర్వాత ఇప్పుడు జగన్కు అండగా నిలిచేందుకు బావ బ్రదర్ అనిల్ కుమార్ సిద్ధమవుతున్నారట. క్రైస్తవ మత ప్రభోదకుడిగా ఉన్న అనిల్ కుమార్ ఇక నుండి కొన్నాళ్ల పాటు తన వృత్తిని పక్కన పెట్టనున్నారని సమాచారం. ఇప్పటికే దేశ, విదేశాలలో ఉన్న పలు పర్యటనలను కూడా ఆయన రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీకి ధీటుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నిలపాలంటే ఇప్పటి నుండే ఫ్యామిలీ మొత్తం కష్టపడాలనే నిర్ణయానికి వచ్చారట.
విజయమ్మ ఇతరుల సహాయంతో పార్టీ వ్యవహారాలు, భారతి రెడ్డి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుండగా.. షర్మిల, అనిల్ కుమార్లు ప్రజలను తమ పార్టీ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారట. షర్మిల ప్రజలను బాగానే ఆకట్టుకుంటున్నారు. బావ బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగి.... దళితులను, క్రిస్టియన్లను పార్టీ వైపుకు లాగాలని చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే జగన్ పార్టీపై మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందనే విమర్శలు వచ్చాయి.
క్రిస్టియన్లు జగన్ వైపు ఉన్నారనే కారణంతోనే గత ఉప ఎన్నికల్లో మంత్రి ధర్మాన ప్రసాద రావు సోనియా పెద్ద క్రిస్టియన్ అని ఈసి నుండి చివాట్లు తిన్నాడు. ఇప్పుడు అనిల్ కుమార్ రంగంలోకి దిగితే పూర్తిస్థాయిలో క్రిస్టియన్లు, దళితులు జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారని అంటున్నారు. అనిల్ కుమార్ పార్టీలో కీ రోల్ పోషిస్తారో తెలియనప్పటికీ ఆయా వర్గాలను జగన్ పార్టీ వైపు రప్పించేందుకు మాత్రం అతను ఇక నుండి తనవంతు ప్రయత్నాలు చేస్తారట. అందుకోసం తన వృత్తిని సైతం ఇక పక్కన పెట్టనున్నారని అంటున్నారు.