ప్రధానితో రహస్య మంతనాలపై బాబు రిప్లై
సాక్షి మీడియా కథనంతో ఆగకుండా ప్రధానితో రహస్య మంతనాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వరుసగా నిలదీయడం ప్రారంభించారు. కె. ఎర్రంనాయుడు వంటి తెలుగుదేశం నాయకులు ఎంతగా ఆ వార్తలను ఖండించినా వారు వినడం లేదు. చంద్రబాబు ప్రధానితో రహస్య చర్చలు జరపలేదని తెలుగుదేశం నాయకులు చెప్పినా వారు పదే పదే అదే విమర్శను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దానిపై నోరు విప్పారు.
తాను ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రితో రహస్య మంతనాలేమీ జరపలేదని చంద్రబాబు చెప్పారు. బిసి డిక్లరేషన్పై మాట్లాడేందుకు అందరం కలిసి వెళ్లామని, తాను బయటకు రావడంలో ఒకటి రెండు నిమిషాలు ఆలస్యమైందని, దాంతో వైయస్సార్ కాంగ్రెస్ రహస్య మంతనాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని పార్టీ శ్రేణులు నమ్మవద్దని ఆయన కోరారు.
బీసి డిక్లరేషన్పై వివిధ పార్టీల జాతీయ నాయకుల మద్దతును కూడగట్టేందుకు చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో బీసీ డిక్లరేషన్పై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిశారు. తిరిగి వచ్చేప్పుడు మిగతావారు అంతా బయటకు వచ్చారు. చంద్రబాబు ఒకటి రెండు నిమిషాలు ఉండిపోయారు. ఆ సమయంలోనే చంద్రబాబు ప్రధానితో రహస్య మంతనాలు జరిపారనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణగా కనిపిస్తోంది. ఏమైనా, మీడియాకుండే పదును వేరే.