సుజనా చౌదరి తీరుతో చంద్రబాబుకు తలనొప్పి?
హైదరాబాద్: తనకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీరుపైనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. సుజనా చౌదరిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. సుజనా చౌదరి చంద్రబాబు మాట జవదాటరని, చంద్రబాబు చెప్పడం వల్లనే సుజనా చౌదరితో పాటు ముగ్గురు ఎంపీలు రాజ్యసభకు గైర్హాజరయ్యారని విమర్శలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. పైగా రాజీనామా లేఖలను చంద్రబాబుకు ఇచ్చిన తర్వాత సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో పార్టీ నాయకులు చాలా మంది రగిలిపోతున్నారు.
ఎంపీల గైర్జాజరీపై విమర్శలు చేసిన పార్టీ సీనయర్లపై సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దారిన ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదని, వాళ్లే పార్టీని నడిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాము క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ కోసం తాము పనిచేస్తున్నామని, జరిగే సంఘటనలు తమపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని, రాజ్యసభకు వెళ్లిన సుజనా చౌదరికి తమ కష్టాలు తెలిసే అవకాశం లేదని సీనియర్లు గుర్రుమంటున్నారు.
గైర్హాజరుతో జరిగిన నష్టంపై తమకు కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని, దాంతో తాము స్పందించాల్సి వచ్చిందని, అంత మాత్రాన తమను చౌదరి కుక్కులుగా, తనను తాను ఏనుగుగా చెప్పుకోవడం అహంకారమేనని వారంటున్నారు. వారంతా ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబును కలిసి సుజనా చౌదరిపై ఫిర్యాదు చేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర చేస్తున్నారని, తాము కూడా పార్టీ కోసం కష్టపడుతున్నామని అంటూ ఇలాంటి ఎంపీల చర్యలతో తాము కార్యకర్తలకు ఏమి సమాధానం చెబుతామని ప్రశ్నిస్తున్నారు.
సుజనా చౌదరికి తాము కూడా గట్టిగా సమాధాన చెప్పగలం కానీ చంద్రబాబు ప్రాణాలు అడ్డుపెట్టి పాదయాత్ర చేస్తూ కష్టపడుతున్నారని, ఆయనను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదని, దానిని చౌదరి లాంటి వాళ్లు అలుసుగా తీసుకోవడంతోనే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్లు అంటున్నారట.