జగన్ ఎఫెక్ట్: బైపోల్స్తో 'తెలంగాణ'కు పుల్స్టాప్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసును బాగానే దెబ్బతీశాడు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కాంగ్రెసు వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం కాంగ్రెసు ఒక్క ఉప ఎన్నికలో గెలిచింది లేదు. దీంతో ఎలాగైనా కాంగ్రెసును రాష్ట్రంలో బతికించుకోవడానికి నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగింది.
పద్దెనిమిది నియోజకవర్గాలలో జరుగుతున్న ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కనీసం నాలుగైదు స్థానాలలోనైనా గెలుపొందితే పార్టీ పరువు నిలబడుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం అధిష్టానమే కార్యాచరణ రూపొందిస్తుంది. జగన్ను ధీటుగా ఎదుర్కొనేందుకు జాతీయ నేతలను అడపాదడపా సభలకు పంపిస్తోంది. ఇటీవల వాయలార్ రవి గోదావరి జిల్లాల్లో బహిరంగ సభలలో మాట్లాడారు.
అయితే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలో గెలుపు విషయంలో వైఫల్యం చెందితే రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాకాకుండా ఆశించిన ఫలితాలు వస్తే మాత్రం రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని భావిస్తోందట. అలా అయితే 2014 వరకు జగన్ ప్రభావం మరింత తగ్గుతుందని భావిస్తోందట.
ఇదే విషయాన్ని, తెలంగాణ తేల్చాలని డిమాండ్ చేస్తూ సస్పెన్షన్కు గురైన ఎంపీలకు సైతం అధిష్టానం చెప్పిందంటున్నారు. జూన్లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు పార్టీ ఇమేజ్ దెబ్బతీయకుండా ఉద్యమాలు, ఆందోళనలు అంటూ ఇబ్బంది పెట్టవద్దని సూచించారట. జూన్లోగా అని చెప్పడం అంటే ఉప ఎన్నికల ఫలితాలు ఆ లోగా వచ్చేస్తాయి.
ఆ ఎన్నికల ఫలితాలను అనుసరించే నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశ్యంలో భాగంగానే అధిష్టానం వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. సీమాంధ్రలో జగన్ను ఎదుర్కోలేని పక్షంలో తెలంగాణ ఇచ్చి, కనీసం ఆ ప్రాంతంలోనైనా పార్టీని రక్షించుకోవాలనే ఉద్దేశ్యంలో అధిష్టానం ఉందని అంటున్నారు. అయితే తెలంగాణకు ఉప ఎన్నికలకు సంబంధం లేదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తదితర నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications