వివేకాకు జగన్ హ్యాండ్: ఆల్టర్నేట్గా విజయమ్మ!
పార్టీలో అనడం కంటే కుటుంబంలోనే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశముందంటున్నారు. జగన్ పులివెందుల నుండి పోటీ చేస్తే... కడప సీటును ఆ ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ చిన్నాన్న తనయుడు అవినాష్ రెడ్డి, సోదరి షర్మిల, బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిలు టిక్కెట్ ఆశిస్తున్నారట. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన సోదరులు నియోజకవర్గ బాధ్యతలను నెత్తిన వేసుకునేవారు.
వైయస్ మృతితో ఇప్పుడు అంతా జగన్ మయమైంది. అతను పులివెందుల నుండి పోటీ చేస్తే పోటీ చేసేందుకు మేమంటే మేం అని కుటుంబ సభ్యులు పలువురు అంటున్నారట. తొలుత అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటుపై జగన్ మాట ఇచ్చారు. అయితే ఇటీవల జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ బాధ్యతను షర్మిల తన భుజాన వేసుకున్నారు. ఆమె కూడా కడప టిక్కెట్ ఆశిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి పదవిపై కూడా ఆశలు పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది జగన్ ఒకవేళ జైలులోనే ఉండిపోతేనే. కానీ ఆయన బయటకు వచ్చిన పక్షంలో కడపను ఆమె ఆశిస్తున్నారట. మాట ఇచ్చిన ప్రకారం అవినాష్కు ఇస్తారా లేక పార్టీ కోసం రోడ్డున పడ్డ షర్మిలకు ఇవ్వాలా అనే అంశంపై పార్టీలో ఇప్పటి నుండే చర్చ ప్రారంభమైందట. వీరిద్దరే కాకుండా బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి కూడా ఆ టిక్కెట్ను ఆశిస్తున్నారట.
అయితే పార్టీ వర్గాలు వైయస్ వివేకానంద రెడ్డిని లెక్కలోకి తీసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ కాంగ్రెసు నుండి బయటకు రాగానే ఆయనకు అండగా నిలబడేందుకు రాని వివేకాకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు చెబుతున్నారట. అంతేకాకుండా వదిన పైనే పోటీ చేశాడని, ఇలాంటివి ఎలా మర్చిపోతామని పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. కడప టిక్కెట్ పైన వివేకా బాగా ఆశలు పెట్టుకున్నారట.
అయితే పార్టీ నేతల ఒత్తిడి మేరకైనా లేక తనకు కష్టకాలంలో అండగా నిలబడలేదనే కారణంతో జగనే స్వయంగానైనా వైయస్ వివేకాకు కడప టిక్కెట్ కేటాయించే అవకాశం లేదని అంటున్నారు. ఇటు అవినాష్ను అటు షర్మిలను పక్కకు పెట్టి తన తల్లి విజయమ్మను కూడా రంగంలోకి దింపవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయమ్మను రంగంలోకి దింపితే మిగిలిన వారెవరూ తమ అసంతృప్తిని బయట పెట్టలేకపోవచ్చునని, ఇంతకుమించి జగన్కు ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. అయితే ఏం జరగాలన్నా మరికొన్నాళ్లు ఆగాల్సిందేనని అంటున్నారు.