కెసిఆర్కు మన్మోహన్ సింగ్ చెప్పారట

ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత పిలిచి మాట్లాడుతామని ప్రధాని చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే మంచిదని, లేదంటే తమ బాట ఉద్యమ బాట అని ఆయన అన్నారు. ఇంత కాలం తాను మౌనంగా ఉండడానికి గల కారణంపై ప్రశ్నలు వస్తున్న తరుణంలో ఆయన దానికి హేతుబద్దమైన కారణమే చూపించారు. వ్యూహాలు, ఎత్తుగడల్లో కెసిఆర్ అందె వేసిన చేయి అంటారు. అలాగే మాటల మాంత్రికుడని కూడా ఆయనకు పేరు.
తెలంగాణ సాధన విషయంలో ఇటీవలి కాలంలో కెసిఆర్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాను మౌనంగా ఉన్నానంటే ప్లాన్ చేస్తున్నానని అనుకోవాలని కూడా ఆయన ఇంతకు ముందు చెప్పారు. కేంద్రాన్ని ఒక ఊపు ఊపుతామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన మరో ఎత్తుగడ కూడా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జెఎసి నుంచి కోదండరామ్ను తప్పించి, ఇటీవలే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన స్వామిగౌడ్కు అప్పగించాలని చూస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఇందుకు తగినట్లుగానే తెలంగాణ జెఎసి కూడా ప్లాన్ చేసుకుంటోంది. కెసిఆర్తోనూ తెరాసతోనూ సంబంధం లేకుండా ఉద్యమాన్ని సంఘటితం చేసే ప్రయత్నాలు శ్రీకారం చుట్టింది. ఊరూరా కమిటీలు వేస్తూ ఉద్యమ అగ్నిని రాజేస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ జెఎసి తెలంగాణ మార్చ్కు పిలుపునిస్తే ఆగస్టు 20వ తేదీ నుంచి తాము ఉద్యమంలోకి దూకుతామని కెసిఆర్ ప్రకటించారు. మొత్తం మీద, తెలంగాణ ఉద్యమంలో వ్యూహాలు, ఎత్తుగడలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications