షర్మిల యాత్రలో సబ్బం కాంగ్రెసుకు గుడ్బై?
షర్మిల పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు వైయస్సార్ కాంగ్రెసులోకి జంప్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. గురువారంనాడు అనకాపల్లి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయమై చర్చించినట్లు సమాచారం.
2014 ఎన్నికలకు మరో సంవత్సరం కాలమే ఉండటంతో ఇక కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైయస్సార్ కాంగ్రెసులోకి రావాలే తన మనసులోని మాటను ఆయన జగన్ వద్ద వెల్లడించినట్లు సమాచారం. షర్మిల పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గానికి చేరుకోగానే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయాలని సబ్బం హరి నిర్ణయానికి వచ్చారని చెపుతున్నారు.
నిజానికి, సబ్బం హరి మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాల్సింది. కానీ ఆయన ఆగిపోయారు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతూ ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారు. అయినా కాంగ్రెసు పార్టీ ఆయనపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇలా రెండు పార్టీలపై కాళ్లు పెట్టడం ఎంతో కాలం కుదరదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.