విజయమ్మ ధర్నా: జగన్నే అడ్డుకుని ఉంటే...
కాగా, ఆనాడే తాము సరిగా వ్యవహరించి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇందులో నాయకత్వ తప్పిదం ఉందనే అభిప్రాయం తెరాస శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ ఒక్కసారిగా శత్రుపూరిత వైఖరి తీసుకోవడం కొంత నష్టం చేసిందని భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతు దీక్షకు వచ్చినప్పుడు వైయస్ జగన్ను అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.
అంతేకాకుండా హైదరాబాదులో ఫీజు దీక్ష చేసినప్పుడు కూడా తెరాస నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. పైగా, దీక్షకు తెరాస తన కార్యకర్తలను పంపించిందనే విమర్శలను కూడా ఎదుర్కుంది. వైయస్ జగన్తో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారనే విమర్శలను నిజం చేసేలా తెరాస వ్యవహారం నడిచిందని అంటున్నారు. దీంతో వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాను అడ్డుకోవడంలో కాస్తా ఇబ్బంది ఎదురైందనే భావన కూడా ఉంది.
మొత్తం మీద, తెలంగాణలో సీమాంధ్ర నాయకులు పర్యటించాలంటే అంత సులభం కాదనే సంకేతాలు మాత్రం వైయస్ విజయమ్మను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాల వల్ల పంపించగలిగామని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.