ఫొటోలు: తెలంగాణపై చిరు, కావూరి లోలోపల?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉధృత కార్యాచరణకు దిగిన తమ పార్టీ నాయకులకు కాంగ్రెసు అధిష్టానం పదవులు కట్టబెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతూ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ ప్రజల్లోకి వెళ్లిన చిరంజీవికి గతంలోనే కాంగ్రెసు అధిష్టానం కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. తాజాగా, కావూరి సాంబశివ రావుకు ఇటు పార్టీలోనూ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోనూ ఉన్నత స్థానం కల్పించింది.
తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రిపదవి స్వీకరించిన తర్వాత కావూరి సాంబశివ రావు అన్నారు. చిరంజీవి కూడా తనకు మంత్రి పదవి లభించగానే ఆ మాటలే అన్నారు. ఆ రకంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే నేతలను పార్టీ అధిష్టానం మౌనం వహించేలా చూస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, కావూరి సాంబశివ రావు తెలంగాణకు వ్యతిరేకంగా ఉధృతంగా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం ప్రకటించడానికి సిద్ధమైనందనే వార్తలు వస్తున్నాయి. ఈ వారంలోనే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నిర్ణయం ప్రకటిస్తుందని గట్టిగానే చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన కావూరి సాంబశివ రావుకు కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా ఇచ్చారని అంటున్నారు. అదే సమయంలో పార్టీలోని అత్యున్నత నిర్ణాయక సంస్థ సిడబ్ల్యుసిలో శాశ్వత సభ్యుడిగా స్థానం కల్పించింది. కేంద్ర మంత్రిగా ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బలంగా వినిపించే అవకాశం లేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సభలు నిర్వహించిన చిరంజీవి కాంగ్రెసులో చేరిన తర్వాత అధిష్టానం మాట తన మాట అని అంటున్నారు. కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణపై మాట్లాడడం పూర్తిగా మానేశారు. అయితే, తన వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుతో ఆయన కథ నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
సమైక్యాంధ్ర ఆందోళనకు నాయకత్వం వహించిన కావూరి సాంబశివ రావు మంత్రి పదవి దక్కగానే తెలంగాణపై అధిష్టానం మాటే తన మాటగా చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం వద్ద ఎనలేని పలుకుబడి ఉన్న కావూరి సాంబశివరావు తెలంగాణకు వ్యతిరేకంగా లోలోన వ్యవహారాలు నడిపిస్తారని తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు.
సమైక్యాంధ్ర నినాదానికి తానే చాంపియన్ అన్నట్లుగా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యవహరిస్తుంటారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెసు అధిష్టానం తీరు చూస్తుంటే కూడా ఆయన మాటలు నమ్మేట్లుగానే ఉన్నాయి. తీరా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆయన ఏం చేస్తారనేది చెప్పలేం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా గొంతేత్తినవారిలో కాంగ్రెసు నుంచి గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా ఉన్నారు. అయితే, ఆయన పూర్తిగా కాంగ్రెసు అధిష్టానానికి విధేయుడిగా మారినట్లు కనిపిస్తున్నారు.
తెలంగాణకు తాను వ్యతిరేకమని నేరుగా రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పలేదు గానీ ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని తెలంగాణవాదులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే, ఆయన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశాలున్నాయి.
కావూరి సాంబశివరావు తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెసు నేతలకు దూరంగా ఉన్నప్పుడు కెవిపి రామచంద్రరావు చురుకైన పాత్ర నిర్వహించారు. సమైక్యవాదాన్ని అధిష్టానం వద్ద వినిపించడంలో ఆయన సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు నేతృత్వం వహించారు. అయితే, ఆయన జగన్ విషయంలో చెప్పిన మాటలు ఆచరణ రూపం ధరించలేదని, ఆయనకు తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.
తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే, ఆమె భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు సమైక్యవాదానికి మద్దతుగా ఓ గ్రంథం రాశారు. ఆమె కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని భావిస్తున్నారు.