సీక్రెట్గా ఢిల్లీ టూర్: ఆ ఇద్దరిపై కెసిఆర్ గుర్రు?
వారిద్దరి ఢిల్లీ రహస్య పర్యటన కెసిఆర్లో ఆగ్రహం తెప్పించిందంటున్నారు. కెసిఆర్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తెరాస ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. అందరు భేటీ కోసం ఫాం హౌస్కు రావాలని కెసిఆర్ నేతలకు సూచించారట. పిలుపు వచ్చిన వారిలో జెఏసి నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కోదండ, శ్రీనివాస్ గౌడ్ల ఢిల్లీ పర్యటన, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాక తెరాసలోని సీనియర్ నేతలు ఆ పార్టీ వైపు వెళ్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఇచ్చాక తెరాస పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందని పలువురు ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విజయశాంతి సహా ముగ్గురు సీనియర్లు కాంగ్రెసు వైపు వెళ్లారు. ఇదే సమయంలో కోదండ, శ్రీనివాస్ గౌడ్లు రహస్యంగా ఢిల్లీకి వెళ్లారనే వార్తలు తెరాసలో చర్చనీయాంశమయ్యాయి.
కోదండ, శ్రీనివాస్ గౌడ్లు రహస్యంగా ఢిల్లీకి వెళ్లారని, జెఏసి ముఖ్య నేతలెవరికి సమాచారం లేకుండా ఢిల్లీ వెళ్లి రావడం చర్చనీయాంశమైందని పత్రికలో వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యుల్లో కొందరి ఆహ్వానం మేరకే వారిద్దరూ ఢిల్లీ వెళ్లి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోందని, రాత్రివేళ అక్కడ రాష్ట్ర విభజన అనంతర సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నియమించిన కమిటీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కలిసినట్లుగా తెలుస్తోందని పేర్కొంది. అయితే తాము ఢిల్లీకి వెళ్లలేదని వారిద్దరు చెప్పినట్లుగా కూడా పేర్కొంది.