కిరణ్ కాన్వాయ్లో కొత్తగా రెండు కార్లు, రూ.4 కోట్లు
ఒక్కో కారు ధర కోటిన్నర రూపాయలు కాగా రెండు కార్లకు మూడు కోట్ల రూపాయలు దాటింది. ఒక్కో కారుకు బుల్లెట్ ప్రూఫ్ను ఏర్పాటు చేసేందుకు రూ.50 లక్షల చొప్పున రెండు కార్లకు రూ.కోటి అయింది. మొత్తంగా కిరణ్ ఉపయోగించనున్న ఈ రెండు కార్లకు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు లెక్క తేలింది.
ఈ కార్ల కొనుగోలును ప్రభుత్వం రహస్యంగా ఉంచిందట. వచ్చే ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల కోసం ఈ కార్లను వినియోగించే అవకాశముంది.
2014 ఎన్నికలలో కిరణ్ మరోసారి ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారును కొత్త ప్రభుత్వం ఇస్తుంది. కిరణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో మహీంద్రా స్కార్పియో స్థానంలో టొయోటా ఫార్యూనర్స్ను ఉపయోగించారు. దాని ఖరీదు రూ.25 నుండి 30 లక్షల వరకు ఉంటుంది.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న బ్రాండ్ టొయోటా ప్రాడోస్ అత్యంత ఖరీదైనవి. బహుశా దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే కావొచ్చంటున్నారు.
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వాహనాల కొనుగోలు పైన ఆంక్షలు ఉన్న సమయంలో కిరణ్ కాన్వాయ్లోకి ఖరీదైన కార్లు వచ్చాయంటున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మొదట టాటా సఫారీని, ఆ తర్వాత మహీంద్రా స్కార్పియోను ఉపయోగించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంబాసిడర్ కార్లను ఉపయోగించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆయనకు టాటా సఫారీని ఇచ్చింది. వైయస్ అకాల మృతి తర్వాత సిఎం అయిన కొణిజేటి రోశయ్య కొత్త స్కార్పియోను వాడారు.
కిరణ్ కాన్వాయ్లో జామర్ వానహంతో పాటు మూడు బుల్లెట్ ప్రూఫ్ ఫార్య్యూనర్లను ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నారు. ఇకపై రెండు బుల్లెట్ ప్రూఫ్ ఫార్యూనర్లు, జామర్తో పాటు మరో రెండు మైన్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి.