కొండా సురేఖ ఇష్యూ: సజ్జల రామకృష్ణా రెడ్డి పాత్ర?
పార్టీలో మొదట్లో మాదిరిగా తమ మాట చెల్లుబాటు కావటం లేదన్న అసంతృప్తి కొండా దంపతుల్లో పేరుకునిపోవడంతో వివాదం ముదిరినట్లు భావిస్తున్నారు. వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాలలో ఇన్చార్జిల నియామకాల విషయంలో తమను సాంబారులో కరివేపాకులా తీసిపారేశారని, తమకన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వారికే ప్రాధాన్యం ఇచ్చారనే భావన కొండా దంపతుల్లో చాలాకాలం నుంచి పేరుకుపోతూ వస్తోందని చెబుతున్నారు.
కొండా దంపతులను సంతృప్తి పరచడానికి వైయస్ జగన్ సజ్జల రామకృష్ణా రెడ్డిని దూరం చేసుకుంటారా అనే చర్చ సాగుతోంది. అయితే, అంత సీన్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ విషయంలో కొండా దంపతులు ఎంత విధేయులో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అంతే విధేయుడని అంటారు. సజ్జల రామకృష్ణా రెడ్డిని కొండా దంపతుల కోసం దూరం చేసుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు.
కొండా దంపతుల దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణా రెడ్డి ఉండి, ఆ మేరకు రాజగకీయ సలహాలు ఇచ్చి అమలు చేయడం వల్లనే కొండా దంపతులు గుర్రుమన్నారని అంటున్నారు. కొండా దంపతులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి సలహా మేరకు అధిష్టానం భావించి చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఏమైనా, జగన్తో భేటీలో కొండా దంపతులకు పెద్దగా దక్కిన హామీలు కూడా ఏమీ లేవని అంటున్నారు.