జగన్కు షాక్: టిడిపితో మజ్లిస్ దోస్తీ!?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల కోటా నుంచి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలో జరగాల్సి ఉంది. గతంలో ఈ ఎన్నికలో మజ్లిస్ మద్దతుతో కాంగ్రెస్ నుంచి ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో త్వరలో ఎన్నిక జరగాల్సి ఉంది. మజ్లిస్, కాంగ్రెస్ల మధ్య స్నేహం బెడిసి కొట్టడంతో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లు, ఇక్కడ ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారు.
ఈసారి ఈ ఎన్నికలో తాము కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మజ్లిస్, టిడిపి నేతల్లో ప్రారంభమైందంటున్నారు. ఈ రెండు పార్టీలకు గ్రేటర్లో కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఎక్కువమంది ఉన్నారు. ఈ ఎన్నికపై ఇప్పటికే మజ్లిస్, టిడిపిల మధ్య రహస్య సమాలోచనలు కూడా జరిగాయంటున్నారు. ఎన్నికల తేదీలు రాకపోవడంతో ఆ చర్చలు పెద్దగా ముందుకు వెళ్లలేదట.
పోటీచేయడానికి మజ్లిస్ ముందుకొస్తే ఆ పార్టీకి మద్దతివ్వాలని, తద్వారా మైనారిటీల నుంచి ఒక మిత్రుడిని సంపాదించుకోవాలని టిడిపి భావిస్తోంది. కాంగ్రెస్తో మజ్లిస్ తెగతెంపులు చేసుకొన్న తర్వాత ఆ పార్టీ నేతలతో టిడిపి నేతలు తరచు మాట్లాడుతున్నారట. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వ్యవహారంపై కూడా ఉభయపార్టీల మధ్య చర్చలు జరిగినట్లుగా సమాచారం. కాంగ్రెసు పట్ల అసంతృప్తితో మజ్లిస్ జగన్ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే.
అయితే, బిజెపితో కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడంపై అసద్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవిశ్వాసం తీర్మానం ఓటింగులో మజ్లిస్తో పాటు టిడిపి కూడా పాల్గొనలేదు. అవిశ్వాసం ఎఫెక్ట్తో ఈ రెండు పార్టీల దోస్తీ మరోసారి చిగురించే దిశలో వెళుతోందంటున్నారు. అయితే, సాధారణ ఎన్నికల వరకు మజ్లిస్ దారి ఎటుంటుందో మాత్రం ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు.