రాయల తెలంగాణ ఇస్తే జగన్కు ఊపు?
హైదరాబాద్: రాయల తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ఆలోచనలకు భిన్నమైన ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పది జిల్లాలతో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చినట్లు ప్రచారం సాగుతూ వస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బలాన్ని చీల్చే ఉద్దేశంతో రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు విస్తృతంగానే ప్రచారం సాగుతోంది.
అయితే, రాయల తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లోనూ వైయస్ జగన్ ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలున్నాయని ఓ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేసి, అందుకు అనుగుణంగా ఏ విధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే విషయంపై ఆ తెలుగు టీవీ చానెల్ తన అంచనాలను ఇచ్చింది. రాయల తెలంగాణ ఇస్తే వైయస్ జగన్ ఈ కొత్త రాష్ట్రంలో 70 దాకా శాసనసభా స్థానాలను గెలుచుకునే అవకాశాలుంటాయని అంచనా వేసింది.
రాయల తెలంగాణ వల్ల కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని వ్యాఖ్యానించింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే కాంగ్రెసు ప్రయోజనం ఉంటుందని తేల్చింది. ఈ రకమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణలో కాంగ్రెసు పార్టీ, సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయోజనం పొందుతాయని వ్యాఖ్యానించింది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ కూడా గణనీయంగానే పుంజుకుంటుందని అంటున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ నెలకొంటుందని బావిస్తున్నారు.