షర్మిల పాదయాత్ర వాయిదా వ్యూహాత్మకమే?
పైగా, ఆమె పాదయాత్ర వాయిదా పడిందని బయటకు చెబుతున్నప్పటికీ మొత్తంగానే రద్దు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తన పాదయాత్రను ఆపేశారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం నేపథ్యంలో పార్టీ వైఖరిపై తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చుననే ఉద్దేశంతో షర్మిల పాదయాత్రను ఆపించినట్లు చెబుతున్నారు. అఖిల పక్షం వేడి వల్ల తెలంగాణలో షర్మిల పాదయాత్రకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చునని జగన్ అనుమానించినట్లు చెబుతున్నారు.
దానికితోడు, పాదయాత్ర చేస్తే ప్రజల్లో షర్మిలను చూడాలనే ప్రజల ఆసక్తి పూర్తవుతుందని, తర్వాత ప్రచారానికి వెళ్తే అంతగా ఆసక్తి ఉండకపోవచ్చునని అనుకున్నారట. వచ్చే ఎన్నికల్లో షర్మిలను స్టార్ కాంపెయినర్గా దించేందుకు వీలుగానే పాదయాత్రను రద్దు చేయించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ జైలు నుంచి ఈ నెలాఖరులోగా బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. బయటకు వచ్చిన తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్తారని, అందువల్ల ఇద్దరి శక్తులనూ ఒకేసారి వినియోగించడం సరి కాదని భావించినట్లు చెబుతున్నారు.
జగన్ ప్రజల్లోకి వెళ్తే, షర్మిల ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారని అంటున్నారు. దానివల్ల షర్మిలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని వాడుకోవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నమ్ముతోంది. అందువల్ల తక్కువ వ్యవధిలో రెండుసార్లు పర్యటనలు అనవసరమని అనుకున్నారట.