బాబుకు మరో షాక్: జగన్ పార్టీలోకి శివప్రసాద్?

తెలుగుదేశం పార్టీని వీడిన కడియం శ్రీహరికి మద్దతుగా శివప్రసాద్ మాట్లాడారు. దీంతో ఆయన పార్టీని వీడడానికే ఆ విధమైన మద్దతు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీని వీడినంత మాత్రాన శ్రీహరిని ద్రోహిగానో, రాజకీయ వ్యభిచారిగానో చిత్రీకరించడం సరి కాదని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.
శివప్రసాద్ ఓ సూటి ప్రశ్న కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు విసిరారు. ఆ మాటకొస్తే ఫిరాయింపుదార్లు కానిదెవరనేది ఆ ప్రశ్న. అది పరోక్షంగా చంద్రబాబుకు తగిలిందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తాను మామ ఎన్టీ రామారావుపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు.
పార్టీలో కొనసాగేలా చూసుకోవడానికి బదులు పార్టీని వదిలిపెట్టేవారిని దూషించడం పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచిది కాదని శివప్రసాద్ అభిప్రాయంగా కనిపిస్తోంది. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని ప్రకటించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరినీ విశ్వాసంలోకి తీసుకుని పార్టీలో కొనసాగేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన సూచన.
శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని గతంలో ప్రచారం సాగింది. అయితే, ఆయన పార్టీలో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా ప్రకటనతో ఆయన పార్టీలో కొనసాగే విషయంపై సందేహం కలుగుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications