నేను లేనప్పుడు గొడవా: మంత్రిపై బాబు అసహనం
హైదరాబాద్: తానులేని సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి గొడవ చేయడం సరికాదని మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయ్యన్న రెండు రోజుల క్రితం సీఎం పేషీకి వెళ్లి చిందులు వేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబు ఈ విషయం తెలిసి తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం ఆర్డీవో బదలీ వివాదంపై తనతో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం భేటీ అయిన సందర్భంగా స్పందించారు.
కాగా, బదలీల విషయంలో తాను ఐఏఎస్ అధికారులను తిట్టినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని శనివారం అయ్యన్నపాత్రుడు వివరించారు. సీనియర్ మంత్రిగా ఐఏఎస్ అధికారులను తాను గౌరవిస్తానని చెప్పారు. 34 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎంతోమంది ఏఐఎస్ అధికారులతో కలిసి పని చేశానని తెలిపారు. వారి పట్ల తాను ఏనాడు కూడా అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు.
ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం మంత్రి అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అధికారుల పైన చిందులు వేసినట్లుగా వచ్చిన వార్తల పైన ఆయన వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. అదే సమయంలో విశాఖ జిల్లాలో ుద్యోగుల బదలీల వివాదంపై సీఎంతో చర్చించారని తెలుస్తోంది.