కాదంటే ఔనని!: కింగ్మేకర్స్ 3గురు మహిళలు
హైదరాబాద్: సార్వత్రిక బ్యాలెట్ సమరం సోమవారంతో ముగిసింది. మే 16వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి. అయితే, పరిస్థితి అటు ఇటు అయితే మాత్రం ముగ్గురు 'అమ్మ'లు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతిలు ఫలితాల అనంతరం కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు.
ఎగ్జిట్ ఫలితాలు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి కొన్ని సీట్లు తక్కువ పడినా, బిజెపిని అధికారంలోకి రానీయవద్దని కాంగ్రెసు పార్టీ మరో ఫ్రంట్కు మద్దతిచ్చినా మాయావతి, జయలలిత, మమతా బెనర్జీల పాత్ర కూడా కీలకంగా మారనుందని అంటున్నారు.
నరేంద్ర మోడీ
దేశవ్యాప్తంగా ఎన్డీయే పవనాలు వీస్తున్నాయి. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో జయలలితలు మాత్రం ప్రభంజనం సృష్టించే అవకాశాలున్నాయి. మాయావతి కూడా ఉత్తర ప్రదేశ్లో ఎన్డీయే తర్వాతి స్థానంలో ఉండదనుందట. మే 16న ఫలితాల్లో తమకు కొన్ని సీట్లు తక్కువ పడితే.. ఏ పార్టీతోనైనా కలిసేందుకు తాము సిద్ధమని బిజెపి చెబుతోంది. అయితే, మాయావతి, మమతా బెనర్జీలు మాత్రం ఎన్డీయేలో కలిసే ప్రసక్తి లేదని చెబుతున్నారు.
జయలలిత
తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. 39 లోకసభ స్థానాలకు గాను అన్నాడిఎంకె 30 స్థానాలకు పైగా గెలుచుకోనుందట.
మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీ 42 స్థానాలకు గాను 30కి పైగా స్థానాలను గెలుచుకోనుందట.
మాయావతి
ఉత్తర ప్రదేశ్లో మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్పీ పార్టీ బిజెపి తర్వాత రెండో స్థానంలో ఉండనుందట. యూపిలోని 80 స్థానాలకు గాను బిజెపి 40కి పైగా లోకసభ స్థానాలు గెలుచుకోనుందట. ఆ తర్వాత బిఎస్పీ 13కు పైగా స్థానాలు గెలుచుకోనుందట.
బిజెపి
మే 16 ఫలితాల అనంతరం బిజెపికి సీట్లు తక్కువ పడినా లేక కాంగ్రెసు లేదా మరో ఫ్రంట్ మేజిక్ ఫిగర్కు దగ్గరగా ఉన్నా మమతా, మాయా, జయలలితలు కింగ్ మేకర్స్గా మారే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందు యూపిఏ, ఎన్డీయేల పైన నిప్పులు చెరిగిన ఆ ముగ్గురమ్మలు ఎవరితోనైనా కలిసినా కలవొచ్చు. కింగ్ మేకర్లం అవుతామనుకుంటే తప్పకుండా జత కలుస్తారని అంటున్నారు.