మా ఇంట్లో పక్కింటి ఫోటోనా: కవిత, హరీష్ ఆగ్రహం
తెలంగాణ సంస్కృతిని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రమంత్రి అశోక గజపతి రాజు దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేబినెట్ దృష్టికి తీసుకు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ఎన్టీఆర్ పేరు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో.. పక్కింటి వారి ఫోరు పెట్టినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.
గుడ్డి కొంగ చెరువు గట్టున దొంగ జపం చేసినట్లు చంద్రబాబు హుస్సేన్ సాగర్ గట్టున ఎన్టీఆర్ జపం చేశారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. విమానాశ్రయంలోని టెర్మినల్ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ శాసన సభలో చేసిన తీర్మానాన్ని తప్పు పట్టడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపర్చడమే అన్నారు. చంద్రబాబుది కుట్ర జపం అన్నారు.
పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు మన శాసన సభ తీర్మానాన్ని వ్యతిరేకిస్తుంటే ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు పక్కనే ఉండి మాట్లాడక పోవడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్కు టీడీపీ రాజకీయ భిక్ష పెట్టిందని చంద్రబాబు అంటున్నారని, ఆయనకు కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ రాజకీయ భిక్ష పెట్టిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ మృతికి కారణమెవరో చెప్పాలన్నారు.