కెసిఆర్కు కెటిఆర్ సహా కొండా సురేఖ ఝలక్?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారంనాడు చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి, ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు గైర్హాజరు కావడంతో పుకార్లు షికార్లు చేశాయి. దాంతో పాటు కొండా సురేఖ వంటి కొంత మంది శాసనసభ్యులు కూడా రాజభవన్లో చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి రాకపోవడంతో ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. మంత్రి పదవిని ఆశించిన కొప్పుల ఈశ్వర్ కూడా దూరంగానే ఉన్నారు.
దాంతో కొంత మంది శాసనసభ్యులు కెసిఆర్కు తొలిసారి ఝలక్ ఇచ్చారనే మాట వినిపిస్తోంది. డుమ్మా కొట్టినవారిలో పలువురు మంత్రి పదవులు ఆశించి భంగపడినవారే కావడం విశేషం. ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తిస్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. దీంతో ఇక ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కొండా సురేఖ, శ్రీనివాస్గౌడ్, ఏనుగు రవీందర్రెడ్డి, గంప గోవర్థన్, జలగం వెంకట్రావు, బిగాల గణేష్ గుప్తా తదితరులు గైర్హాజరయ్యారు. ఏ పదవీ దక్కని ఏనుగు రవీందర్రెడ్డి, విప్ పదవి అయినా దక్కుతుందని ఆశించి భంగపడ్డ గణేష్ గుప్తా కూడా గైర్హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన చాలామందికి మంత్రి పదవులు ఇచ్చారని, తొలి నుంచీ టీఆర్ఎస్లో కొనసాగుతున్న వారికి తగినంత న్యాయం జరగలేదని అంటున్నారు.
అయితే, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడం తెలంగాణ సిఎం కెసిఆర్కు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. పక్కా వ్యూహంతోనే ఆయన మంత్రివర్గ విస్తరణ చేపట్టారని, అసంతృప్తికి గురైన శాసనసభ్యులకు నచ్చజెప్పడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.