స్వచ్ఛ్ భారత్: చీపురు పట్టనున్న గవర్నర్
హైదరాబాద్: అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ చీపురు పట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గవర్నర్ దంపతులు ఆ రోజున సైఫాబాద్లోని రాజ్భవన్ ఉద్యోగుల వసతిగృహాల కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడతారు.
గవర్నర్ దంపతులతో పాటు దాదాపు 200 మంది రాజ్భవన్ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వచ్ఛ భారత్ కార్య క్రమంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారంతా కూడా ఇందులో పాల్గొనాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువత, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పాల్గొనాలని గవర్నర్ కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.