ఈగ తీర్పు: మహిళకు ఉపసర్పంచ్ పదవి!
పుణె: ఈగ తీర్పు చెప్పడం ఏంటి?.. మహిళకు ఉప సర్పంచ్ పదవి లభించడం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడ అలాగే జరిగింది మరీ. ఉపసర్పంచ్ పదవి కోసం పోటీ ఏర్పడటంతో న్యాయ నిర్ణేతగా ఈగను వారు నిర్ణయించారు. దీంతో ఆ ఈగే వారి సమస్యను తన తీర్పుతో పరిష్కరించింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఖేద్ తాలూకా సత్కారప్తల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రామపంచాయతీలో మొత్తం తొమ్మిది మంది వార్డు మెంబర్లు ఉన్నారు. వారిలో ముగ్గురు ఉపసర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. దీంతో ఎన్నికలేమీ లేకుండా వారిలో ఒకరికి ఉపసర్పంచ్ పదవి కట్టబెట్టే బాధ్యతను ఈగకు అప్పగించారు పంచాయతీ పెద్దలు. ఉప సర్పంచ్ పదవికి పోటీపడుతున్న ముగ్గురి పేర్లను చిట్టీలపై రాసి అందరి సమక్షంలో గ్రామంలోని భైరవనాథ్ గుడిలో ఉంచారు. ఈగ ఏ చిట్టీపై వాలితే ఆ చిట్టీలో పేరున్నవారే ఉపసర్పంచ్ అని నిర్ణయించారు.

వార్డు మెంబర్లంతా వారినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఇందుకు గ్రామస్తుల తోపాటు వార్డు మెంబర్లంతా అంగీకరించడంతో ఎంపిక భారం ఈగపైనే వేశారు. ఈ క్రమంలో ఈగ చలువతో సంజీవని అనే మహిళ ఉప సర్పంచ్గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ విషయం జిల్లా అధికారులకు చేరడంతో ఇలాంటి విధానాలు చెల్లవని అభ్యంతరాలు తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం మూకుమ్మడిగా అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చారు.
కాగా, ఈగ తీర్పు ప్రకారం ఉపసర్పంచ్ను వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్తులు కూడా వారి నిర్ణయాన్ని సమర్థించారు. ఎన్నికైన ఉపసర్పంచ్ మామ మాట్లాడుతూ.. ఈ విషయంలో అధికారులు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. నిరుడు కూడా ఉపసర్పంచ్ ఎన్నికను ఈ విధంగానే జరిపామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications