ఒక్కకడుపున పుట్టినా: పవన్పై చిరు! 'ఆశ' భరోసా
హైదరాబాద్: ఒక్క తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్యనే ప్రేమలు ఉండటం లేదని, విద్వేషాలు పెరుగుతున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి సోమవారం అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరా భవన్లో జరిగిన పంచాంగ శ్రవణంలో చిరంజీవి, సి రామచంద్రయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంచాంగ శ్రవణం అనంతరం చిరంజీవి పై వ్యాఖ్యలు చేశారు. ఒక్క తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్యనే ప్రేమలు లేవని చిరంజీవి చెప్పడం తన సోదరుడు, జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చిరుతో పవన్ కళ్యాణ్తో విభేదించి కొత్త పార్టీ పెట్టడమే కాకుండా... బిజెపికి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కాగా, ఉగాది పచ్చడి రుచి తరహాలో మనిషి జీవితం ఉంటుందని చిరంజీవి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మనిషి జీవితం ఉగాది పచ్చడి వంటిదన్నారు. జీవితంలో తీపి, చేదు, వగరు, పులుపు... ఇలా అన్ని ఉంటాయని చెప్పారు. ఏమున్నా లేకపోయినా మనిషి ఆశతో ఉండాలని, ఆ ఆశనే బతికిస్తుందని పంచాంగ శ్రవణ కర్త చెప్పినప్పుడు భరోసాగా అనిపించిందన్నారు.
ఒక మాష్టారు చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుకు వస్తోందని... ఒక గదిలో నాలుగు కొవ్వొత్తులు వెలుగుతుంటాయని, అందులో ఒకటి శాంతి, రెండోది నమ్మకం, మూడోది ప్రేమ చాటేదని, నాలుగోది ఆశను రేకెత్తించేదని అన్నారు. ప్రపంచంలో శాంతికి అవకాశం లేదని మొదటి కొవ్వొత్తి కొడగట్టిందని, రెండోది నమ్మకం కోల్పోయి ఆరిపోయిందని, ప్రేమకు తావులేదని మూడోది ఆరిపోయిందని, ఆశ అనే కొవ్వొత్తి మాత్రం వెలుగుతూనే ఉందన్నారు. అలా కాంగ్రెసు నేతలు మాత్రం ఆశను మాత్రం వదులుకోవద్దన్నారు.