కిరణ్ రెడ్డి తాత్కాలిక రాజకీయ సన్యాసం?

ప్రస్తుత స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టే అవకాశాలు లేవనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యమంత్రిగా అండగా నిలబడుతూ వచ్చిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా కొత్త పార్టీ గురించి మాట్లాడకుండా రాజకీయాల నుంచి తప్పుకంటున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి కొన్నాళ్ల పాటు అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చి ఎఐసిసిలో చేరిపోతారని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మంగళవారంనాడు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టే అవకాశాలు లేవని అంటున్నారు.
కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయి తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం ఆయనకు ఏదో ఒక పదవిని బహుమతిగా ఇవ్వవచ్చునని అంటున్నారు. కె. రోశయ్యను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పంపినట్లు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసే అవకాశమో, రాజ్యసభకు ఎంపిక చేసుకునే అవకాశమో ఉందని చెబుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి సహకరించారనే అభిప్రాయమే బలంగా ఉంది. ఏమైనా, కాలమే కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications