ఆర్ కృష్ణయ్య సైకిల్ దిగి కారెక్కుతారా?
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎల్బీనగర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, బిసి నేత ఆర్. కృష్ణయ్య పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన టిడిపికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బిసి నేత అయిన ఆర్. కృష్ణయ్యను చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. టిడిపికి తెలంగాణలో కేవలం 14 సీట్లు మాత్రమే వచ్చాయి. దాని మిత్రపక్షం బిజెపికి ఐదు సీట్లు వచ్చాయి. దీంతో టిడిపి ప్రతిపక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, టిడిపి శానససభా పక్ష నేతగా కృష్ణయ్యను ఎంపిక చేస్తారని భావించారు. కానీ అది జరగలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావును టిడిపి శానసభా పక్ష నేతగా ప్రకటించారు. టిడిఎల్పీలో కృష్ణయ్యకు ఏ విధమైన పదవి కూడా దక్కలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తనకు వ్యతిరేకంగా పావులు కదిపారనే ఆగ్రహంతో కృష్ణయ్య ఉన్నట్లు చెబుతున్నారు.
ఆర్. కృష్ణయ్యను చేర్చుకోవడానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. బిసీ నేత కావడంతో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారట. ఏమైనా, తుది నిర్ణయం మాత్రం ఇంకా జరగలేదని అంటున్నారు.