రాసిచ్చిన ప్రసంగమని కురియన్: చౌదరికి భంగపాటు
న్యూఢిల్లీ: ఎవరోరాసి ఇచ్చిన ప్రసంగాన్ని చదవటం పార్లమెంట్కే సిగ్గుచేటు అని, నేను తలచుకుంటే మీరు ఇప్పటి వరకూ మాట్లాడిందంతా రికార్టుల నుంచి తొలగించగలనని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి జె కురియన్ తెలుగుదేశం సభ్యుడు వై ఎస్ చౌదరిని అభిశంసించారు.
పత్రికాస్వేఛ్చను అదుపుచేయటానికి జరుగుతున్న ప్రయత్నాలపై జరిగిన స్వల్పకాలిక చర్చను చౌదరి ప్రారంభించారు. ఆయన ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని చదివారు. తనకు కేటాయించిన సమయం ముగిసిపోయిన తరువాత కూడా కురియన్ ఆదేశాలను లక్ష్య పెట్టకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
పైగా ధిక్కార స్వరంతో తన ప్రసంగం పూర్తిఅయ్యేంత వరకూ ఆపబోనని చౌదరి సవాలు చేయటంతో సభా వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. తన ప్రసంగం పూర్తిగా చదవకపోతే అనుకున్న లక్ష్యం నేరవేరదని చెప్పి ప్రసంగాన్ని ఆపకుండా చదువుతూ పోయారు. సమయం మించిపోవడంతో మాట్లాడటం నిలిపి వేయాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ కురియన్ పదే పదే చేసిన విజప్తిని చౌదరి లేదు. పైగా ఆయనతో వాగ్వాదానికి దిగారు.
దాంతో కురియన్ తీవ్ర అసహనంతో తయారు చేసుకువచ్చిన ప్రసంగాన్ని చదవటం నియమ నిబంధనలకే విరుద్దమే కాక పార్లమేంటుకే తలవంపులని చౌదరిని హెచ్చరించారు. కురియన్ ఆగ్రహాన్ని చవి చూసిన చౌదరి వెంటనే తన ప్రసంగాన్ని నిలిపివేశారు.