బాబుని నమ్ముతున్నాం: రాజధానిపై నేతలకు షాక్
హైదరాబాద్/గుంటూరు: రాజధాని విషయంలో తుళ్లూరు గ్రామ రైతులు కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు. రాజధానిని రానివ్వరా? ఐదూళ్ల వారు వద్దంటే ఆగిపోవాలా? అంటూ కాంగ్రెస్ నేతల పైన మండిపడ్డారు. తమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉందని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
శనివారం నాడు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య, రుద్రరాజు పద్మరాజు, దేవినేని అవినాశ్ తదితరులు తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులను రాజధానికి భూములు ఇచ్చే విషయమై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పలు గ్రామాల రైతులు కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు.
చంద్రబాబుపై మాకు నమ్మకం ఉందని, రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, నాలుగైదు గ్రామాలవారు వ్యతిరేకిస్తే అసలు రాజధాని రావడానికే రైతులు వ్యతిరేకంగా ఉన్నారని ఎలా అంటారని తుళ్లూరు రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందాన్ని ప్రశ్నించారు.
ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ నేతలకు నోటమాట రాలేదు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ జరిపాలని నిర్ణయించిన రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, బోరుపాలెం, తుళ్లూరు గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. పర్యటన అనంతరం వివరాలను తెలియజేయడానికి తుళ్లూరులో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి రైతులు కాంగ్రెస్ బృందాన్ని అడ్డుకున్నారు.
రామచంద్రయ్య మట్లాడుతూ... భూసమీకరణ విషయంలో భావోద్వేగాలకు గురవుతున్న రైతులకు నమ్మకం కల్గించే దిశగా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులుగానీ ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును రైతులు నమ్మడం లేదని, భూములిచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అనడంతో కొందరు రైతులు అక్కడికి వచ్చి రామచంద్రయ్య బృందాన్ని అడ్డుకున్నారు.
బాబుపై తమకు నమ్మకం ఉందని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదంటూ పలువురు రైతులు కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేవలం నాలుగైదు, గ్రామాల్లో రైతులు మాత్రమే వ్యతిరేకిస్తుండగా, 14 గ్రామాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇంతలో పలువురు గుంటూరు కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని మీకు న్యాయం చేయాలని కోరేందుకే కాంగ్రెస్ బృందం ఇక్కడకు వచ్చిందని వారి శాంతింపజేశారు.
తర్వాత రామచంద్రయ్య మాట్లాడుతూ రాజధానిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదన్నారు. రాయపూడి గ్రామ రైతులు భూములు తీసుకుంటే పురుగుమందు తాగేందుకు కూడా సిద్ధమని తమ పర్యటనలో ఆవేదన చెందారని తెలిపారు. దౌర్జన్యంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు.
పశ్చిమ బెంగాల్లోని సింగూర్ సంఘటనను చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. రాజధాని నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని, రైతులు, రైతు కూలీలను ఆవేదనకు గురిచేయకుండా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
కాగా, ప్యాకేజీని మరింత పెంచేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భూములిచ్చేందుకు రైతులు కూడా సిద్దమవుతున్నారని అర్థమవుతోందని అంటున్నారు. అయితే, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో మాత్రం భూములు ఇచ్చేందుకు వ్యతిరేకమని రైతులు చెప్పారు.